పీవీకి ప్రముఖుల ఘన నివాళి 

24 Dec, 2020 05:04 IST|Sakshi

పీవీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళి

నిరంతర సంస్కరణశీలి
సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్‌ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాల్లో ఆయన అమలు చేసిన సంస్క రణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభ విస్తుందని అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లోనూ ఆయన అవలం బించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారతదేశ సమ గ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్టపరిచిం దని సీఎం కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన పీవీకి ఘననివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తోందన్నారు. 


నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ ఘాట్‌ని సందర్శించి నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు 

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని ఆయన ఘాట్‌ వద్ద మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులర్పించి స్మరించుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు,  ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మలతో పాటు పీవీ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు వకులాభవరణం కృష్ణమోహన్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.  

అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కేకే 
ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి చేసిన గొప్ప మేధావి దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు తెలిపారు. పీవీ జ్ఞాపకార్థం నెక్లెస్‌ రోడ్‌కు ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ నెల 31లోపు పీవీ పేరుతో స్మారక పోస్టల్‌ స్టాంపును ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు.  మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ధైర్యంతో భూ సంస్కరణలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సంస్కరణలను, సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ స్టాంపును విడుదల చేస్తుందన్నారు. 

పీవీ చరిత్రలో నిలిచిపోతారు: ఉత్తమ్‌ 
పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణల వల్ల దేశ చరిత్రలో ఆయన నిలిచిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్‌ పవర్‌గా నిలబెట్టాయన్నారు. 

మరిన్ని వార్తలు