CM KCR: ‘ప్రగతి’ చూపకుంటే మారాల్సిందే!

24 Jun, 2021 04:25 IST|Sakshi

పల్లె/ పట్టణ ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

కలెక్టర్లతో సమావేశం 28 నుంచి 26కు మార్పు

అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలను తీసుకురావాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్య క్రమాల అమలు ఆశిం చిన రీతిలో లేకపోవ డంపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు చివరి హెచ్చ రిక జారీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 28న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ నిర్వహించ తలపెట్టిన సమా వేశం.. రెండు రోజులు ముందుకు జరిగి ఈ నెల 26వ తేదీకి మారింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల (డీఆర్డీఓ)ను తమ వెంట తీసుకురావాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను 
    ఆదేశించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు.

పది రోజుల సమయం
ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిశీలించారు. ఆశించిన రీతిలో పురోగతి లేదని ఆయన గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుపై తన ఆశయాలు, లక్ష్యాలను సవివరంగా చెప్పారు. అయినా క్షేత్రస్థాయిల్లో పరిస్థితులు మారట్లేదని తాజాగా నిర్వహించిన పర్యటనల్లో సీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూడు కార్యక్రమాల అమలు విషయంలో తన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను చివరిసారిగా వారికి స్పష్టం చేయాలని కేసీఆర్‌ ఈ సమావేశానికి తలపెట్టినట్టు సమాచారం. ఈ కార్యక్రమాల అమలుతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలకు ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేయనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు మరోసారి వారం పది రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది.

వచ్చే నెల్లో ఆకస్మిక తనిఖీలు
వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి రెండో విడతగా జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమాల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కలెక్టర్లతో నిర్వహించనున్న సమావేశంలో వానా కాలం సాగు, రైతుబంధు పంపిణీ, ధరణి సమస్యల పరిష్కారం, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.  

మరిన్ని వార్తలు