డబుల్‌ ఇంజిన్‌ కాదు.. పరిగెత్తే ఇంజిన్‌ కావాలి.. మోదీపై కేసీఆర్‌ సెటైర్లు

10 Jul, 2022 18:46 IST|Sakshi

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం కేసీఆర్‌ మరోసారి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని బీజేపీ జలగల్లా పట్టిపీడిస్తోంది. ప్రధాని మోదీ ఏం మాట్లాడారో ఆ భగవంతుడికే తెలియాలి. హైదరాబాద్‌ సభలో కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను తిట్టడానికే పరిమితమయ్యారు. మోదీ ఏదో చెప్తారనుకుంటే.. ఏమీ లేదు. మోదీ ఏం మాట్లాడారో ఎవరకీ అర్థం కాలేదు. ప్రధాని ప్రసంగంలో సరుకు లేదు. మోదీ అవివేక, అసమర్థ పాలన సాగిస్తున్నారు. 

బీజేపీ తెలంగాణకే కాదు. దేశానికి కూడా ఏమీ చేయలేదు. దేశ ప్రజల పక్షాన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ప్రజలకు సంబంధించి మాత్రమే ప్రధానిని కొన్ని ప్రశ్నలు అడిగాను. రుపాయి పతనాన్ని అడ్డుకోవడం ప్రధానికి చేతకాదు. డాలర్‌తో రూపాయి విలువ 80 రూపాయాలకు చేరువలో ఉంది. ఏ దేశంలో పతనం కానీ కరెన్సీ విలువ.. కేవలం భారత్‌లోనే ఎందుకు పతనమవుతోంది. నిరుద్యోగాన్ని నియంత్రించడం కూడా కేంద్రానికి చాతకాదు. ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది. బీజేపీ పాలనలో దేశ రాజధాని ఢిల్లీలోనే విద్యుత్‌ కోతలు, కరెంట​ కోతలు ఉన్నాయి. 8 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. అశక్తులం అని బీజేపీ నేతలు నిరూపించుకున్నారు. 

తెలంగాణలో జరిగిన అభివృద్ధిలో కనీసం 20 శాతం అయినా బీజేపీ చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో భయంకరమైన అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. దేశంలో ఒక్క రంగంలో కూడా ప్రగతి కనిపించడం లేదు.కేంద్రంలో తెలంగాణలాంటి సర్కార్‌ రావాలి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదు.. పనిచేసే తమ ప్రభుత్వం వంటి(టీఆర్‌ఎస్‌) సర్కార్‌ రావాలని కోరుకుంటున్నాము. కేంద్రంలో నాన్‌ బీజేపీ సర్కార్‌ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కేంద్రంలో నాన్‌ బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యం. బీజేపీయేతర రాష్ట్రాల్లోనే అభివృద్ధి కనిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పోవాలన్నదే మా నినాదం.  మిత్రపక్షంతో కలిపి 110 సీట్లు ఉన్న ప్రభుత్వంపైనే విమర్శలా?, 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణాలో మేము సంపూర్ఱ మెజార్టీతో ఉన్నాం. తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల 833 రూపాయలు అయితే దేశ తలసరి ఆదాయం లక్షా 49 వేల 848 రూపాయలు. కేంద్ర అసమర్థ విధానాల వల్ల తెలంగాణ  లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరుతాం. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే నాన్‌ బీజేపీ రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది. మాది 100 హెచ్‌పీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం 50 హెచ్‌పీనే. అంటే ఇక్కడ ఏది డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం. మాదే కదా.. హై స్పీడ్‌తో దూసుకుపోతున్న రాష్ట్రం.  హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం పెట్టడం నిజంగా ఆ పార్టీ తప్పుడు నిర్ణయం’ అని కేసీఆర్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు