ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్‌ రైతుల భూములే: సీఎం కేసీఆర్‌ ఫైర్‌

5 Sep, 2022 17:09 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం, టీఆర్‌ఎస్‌ తలపెట్టిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనించాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. 

తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేశాము. సింగూరు నీళ్లు రాకుండా కుట్ర చేశారు. సింగూరు కాలువల్లో​ నీళ్లు పారాలా?. మతపిచ్చి మంటలతో రక్తం పారాలా?. కాళేశ్వరంతో​ నిజామాబాద్‌లో ప్రతీ గుంటకూ నీళ్లు అందుతున్నాయి. దేశంలో 24 గంటలు విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో​ దళితులకు రూ. 10 లక్షలు ఇచ్చిన రాష్ట్రం మనది. గతంలో రూ. 200 పెన్షన్‌ ఇస్తే ఇప్పుడు రూ. 2వేలు ఇస్తున్నాము.

మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని అంటున్నారు. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు.. ఇక రైతుల భూములే మిగిలాయి. ప్రధాని మోదీ, కార్పొరేట్‌ కంపెనీలు రైతుల భూముల కోసం చూస్తున్నాయి. రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్నారు.  బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. బ్యాంకులకు మోసం చేసిన వారికి రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొట్టండి. ఎమ్మెల్యేలను కొనేవి ప్రభుత్వాలా?. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. దేశం కోసం పిడికిలి బిగించాలి. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఒక్క రంగానైనా బాగు చేశారా?. దేశంలో ఆరోగ్యకరమైన రాజకీయాలుండాలి. 

ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది మన జెండానే. 28 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నన్ను దేశ రాజకీయాల్లోని రావాలని కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాము. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్‌ నుంచే ప్రారంభిస్తాను. 2024లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్‌ ఇస్తాము’ అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు కౌంటర్‌.. మునుగోడు ఎన్నికలపై తరుణ్‌చుగ్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు