CM KCR HALIA Tour: హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తాం: సీఎం కేసీఆర్

2 Aug, 2021 13:06 IST|Sakshi

దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం

జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు

దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైంది

హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్

సాక్షి, నల్గొండ: కోవిడ్ కారణంగా జిల్లా పర్యటన ఆలస్యమైందని సీఎం కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అన్నారు. సోమవారం ఆయన హలీయాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నెల రోజుల్లో హక్కు పట్టాలు ఇస్తామన్నారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

‘‘నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాం. దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం. జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు. దళితబంధు పథకంపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. 12లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం తప్పకుండా చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధు అమలు చేస్తాం. దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైందని’’ సీఎం కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు