181+3 స్థానాలు గెలిపించిన మీకు థ్యాంక్స్‌: సీఎం కేసీఆర్‌

3 May, 2021 21:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను గెలిపించిన ఓటర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) ఎన్నికలు జరగ్గా అందులో టీఆర్‌ఎస్‌ విజయ భేరీ మోగించడంతో సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ  గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టీఆర్ఎస్‌కు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని మరోమారు నిరూపించారు.  టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

చదవండి: మమతాకు ఉన్న ఒకేదారి ఏమిటో తెలుసా..?
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర

మరిన్ని వార్తలు