సాక్షి,సుభాష్నగర్(నిజామాబాద్): సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కొత్త కలెక్టరేట్), టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవాలతోపాటు ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. హెలికాప్టర్లో నిజామాబాద్ పోలీస్పరేడ్ మైదానానికి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చేరుకుంటారు. 2.10 గంటలకు ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ భవన్ను, 2.40 గంటలకు కలెక్టరేట్ను ప్రారంభిస్తారు.
3.05 గంటలకు జీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరి వెళతారు. వాతావరణం అనుకూలించని పక్షంలో చివరి క్షణంలోనైనా మార్పులు, చేర్పులకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. సీఎం రాక నేపథ్యంలో నిజామాబాద్ నగరం ఇప్పటికే గులాబీయమమైంది. నగరాన్ని టీఆర్ఎస్ జెండాలు, తోరణాలతో అలంకరించారు. నగరంతోపాటు జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.