భాగ్యలక్ష్మి అమ్మవారికి యోగి ప్రత్యేక పూజలు 

4 Jul, 2022 01:22 IST|Sakshi
భాగ్యలక్ష్మి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు 

బుల్డోజర్‌ బాబా జిందాబాద్‌ అంటూ పార్టీ శ్రేణుల నినాదాలు 

చార్మినార్‌(హైదరాబాద్‌): ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం ఉదయం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని యోగి స్వయంగా హారతి అందజేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం ఉదయం 7.50 గంటలకు యోగి చార్మినార్‌కు చేరుకోగానే

అప్పటికే అక్కడ వేచివున్న పార్టీ శ్రేణులు ‘‘యోగీ జిందాబాద్‌..బుల్డోజర్‌ బాబా జిందాబాద్‌’’అంటూ నినాదాలు చేశారు. దేవాలయంలో 15 నిముషాలు గడిపి అక్కడినుంచి వెనుదిరిగారు. యోగి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ సీనియర్‌ నాయకుడు టి.ఉమామహేంద్ర తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు