కోల్‌బెల్ట్‌లో కమలానికి షాకిచ్చిన గులాబీ

23 Jan, 2021 11:23 IST|Sakshi

గోదావరిఖని (రామగుండం): సింగరేణి ప్రాంతంలో పట్టుకు టీఆర్‌ఎస్‌ వ్యూహం రచిస్తోంది. త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పార్టీకి కీలకంగా ఉన్న నాయకుడు.. సింగరేణి సైరన్‌గా గుర్తింపు పొందిన నేతను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం బీజేపీకి షాకిచ్చిలా ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బీజేపీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య త్వరలో తన సొంతగూటికి చేరే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ మేరకే ఆయన బీఎంఎస్‌ను వీడారు.

మల్లయ్య టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒంటిచేతితో యూనియన్‌ను నడిపించాడు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సింగరేణివ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 2003 నుంచి సంఘాన్ని ముందుండి నడిపించారు. సుమారు 16 ఏళ్లు టీబీజీకేఎస్‌లో పనిచేసిన మల్లయ్య నాయకత్వ విభేదాలతో సంఘానికి దూరమయ్యారు. టీఆర్‌ఎస్‌ నుంచి కూడా హామీ రాకపోవడంతో పార్టీని వీడారు. అనంతరం 2019 సెప్టెంబర్‌ 30న బీజేపీ అనుబంధ బీఎంఎస్‌ (సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌)లో చేరారు. అక్కడ కూడా మల్లయ్య అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చి బీఎంఎస్‌ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మల్లయ్య ముందుకెళ్తున్నారు. అయితే బీఎంఎస్‌లో గుర్తింపు రాకపోవడం, తాను ఆశించిన జేబీసీసీఐ సభ్యతం రాకపోవడంతో దీంతో మల్లయ్య అసంతృప్తిలో ఉన్నారు. ఈ కారణంగా మూడు నెలలుగా సంఘం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అసంతృప్తిని గ్రహించి టీఆర్‌ఎస్‌ మళ్లీ ఆహ్వానం పలికింది. 

ఈ క్రమంలోనే కెంగర్ల మల్లయ్యను తిరిగి టీబీజీకేఎస్, టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఇటీవల టీఆర్‌ఎస్‌ అధిష్టానంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ యువ, అధినాయకుడు కచ్చితమైన హామీ ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజామున బీఎంఎస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఎంఎస్‌కు రాజీనామా చేసిన మల్లయ్య గోదావరిఖనిలో తన అనుచరులతో సమావేశమై టీఆర్‌ఎస్‌లో చేరే విషయం చర్చించారు. త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ గెలుపు కోసం ఇప్పుడే వ్యూహం సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు