సాక్షి, ఆదిలాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు మృతిపై నిర్మల్ జిల్లా కలెక్టర్ పారూఖీ అలీ స్పందించారు. అతనికి ఇదివరకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, ఈ కారణంగానే అతడు చనిపోయాడని భావిస్తున్నట్లు వివరించారు. అయినప్పటికీ విఠల్ రావు మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. పోస్టుమార్టం పూర్తయిందని, మృతుడి శరీర భాగాలను ఎప్ఎస్ఎల్కు పంపించామని, రిపోర్ట్ రాగానే అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్పై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. టీకాతో ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదని, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. (కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్.. 14 రకాలు )
అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు మృతిపై ప్రజా డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు. కాగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్సీలో విఠల్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విఠల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. (నిర్మల్: కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి మృతి)