గృహహింస బాధిత మహిళలకు న్యాయం చేయాలి

15 Dec, 2020 12:06 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: గృహహింస బాధిత మహిళల హక్కులకు రక్షణ, న్యాయం అందించి అండగా నిలిచేందుకు ఓ సంస్థ ప్రారంభమైంది. ‘కాన్ఫిడరేషన్‌ మూవ్‌మెంట్‌ ఎగినెస్ట్‌ డొమెస్టిక్‌ వయొలెన్స్‌’ పేరుతో స్థాపించిన ఈ సంస్థ గృహహింసకు వ్యతిరేకంగా పని చేయనుంది. మేజర్‌ ప్రొఫెసర్‌ సుల్తానా ఖాన్‌ సోమవారం మీడియా ప్లస్‌ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టంలోని లొసుగులను కొంతమంది సొమ్ముచేసుకుని భార్యాపిల్లలపై దాష్టీకాలకు తెగబడుతున్నారని తెలిపారు. అంజుమ్‌ సుల్తానా అనే బాధిత మహిళకు జరిగిన అన్యాయం గురించి తెలిపారు. అంజుమ్‌కి ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం భర్త ఆమెను వదిలేశాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపారు.

అంజుమ్‌ లాంటి బాధితులు సమాజంలో చాలా మంది ఉన్నారని, తీవ్రమైన గృమహింసకు గురవుతున్న వారు తమ సమస్యలను తెలియజేయడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి మహిళలకు సరైన న్యాయం జరగకపోవటం సమాజానికి శ్రేయస్కరం కాదని తెలిపారు. గృహహింస బాధత మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తమ సంస్థ తరఫున న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సామాజిక మహాజన సంఘర్షణ సమితి, యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆల్‌ మైనారిటీస్‌ ఎమ్మార్పీఎస్, యాంటీ కరప్షన్‌ మహిళా కమిటీ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ,  కవులు, రచయిత్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు