సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ సూచించింది విపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అన్ని వేదికలపై చర్చలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో అన్యాయంగా సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులిచ్చి బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని, అసలేం జరిగిందన్న దానిపై లోతుగా అధ్యయనం చేసి ఎలాంటి వేదికపైనైనా చర్చించేలా ఉండాలని సూచించారు.
నేడు ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా
సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులపై నిరసనగా సోమవారం హైదరాబా ద్లోని ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్, ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నారు. నెక్లెస్రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఉదయం 10కి ర్యాలీగా బయల్దేరి ఈడీ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతారు.