ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి 

21 Mar, 2021 03:50 IST|Sakshi

సాక్షి, మీర్‌పేట: డబ్బులు పంచకపోవడం వల్లే తనకు ఓట్లు వేయలేదని, ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని సూచించారు. పట్టభద్రులు కూడా అధికార టీఆర్‌ఎస్‌కు ఓట్లు అమ్ముకోవడం తనకు బాధ కలిగిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని 26 నెలలైనా నయా పైసా ఇవ్వలేదని, అయినా యువత వీటన్నింటిని మరిచి రూ.వెయ్యి, రెండు వేలకు ఆశపడి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం బాధ కలిగించిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బు, మద్యంతో ప్రభావితం చేసి ఓటు వేయించుకుంటుందని, ఈ సంస్కృతి పోవాలన్నారు.  

మరిన్ని వార్తలు