పీవీ స్ఫూర్తితో అధికారంలోకి..

25 Jul, 2020 04:24 IST|Sakshi
మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మన్మోహన్‌సింగ్, గాంధీ భవన్‌లో వీక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు

పీవీ శతజయంతి వేడుకల ప్రారంభ సమావేశంలో సోనియా సందేశం

అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలు..

గాంధీభవన్‌లో జరిగిన వర్చువల్‌ సమావేశానికి ప్రణబ్, మన్మోహన్, చిదంబరం, జైరాం

పీవీ సేవలను కొనియాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాలు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ నేతృత్వంలో ఇందిరాభవన్‌లో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. కమిటీ చైర్‌పర్సన్, మాజీమంత్రి జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పంపిన సందేశా న్ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదివి వినిపించారు. ‘పీవీ స్ఫూర్తితో పనిచేసి 2023లో తెలంగాణ లో అధికారంలోకి వస్తాం..’అని సోనియా పేర్కొ న్నారు.

వర్చువల్‌ సమావేశంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర మాజీమంత్రులు చిదంబరం, జైరాంరమేశ్‌ జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరుడు మనోహర్‌రావు, కమిటీ గౌరవ చైర్మన్‌ వి.హనుమంతరావు, వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌ బాబు, కన్వీనర్‌ మహేశ్‌గౌడ్, నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, దాసోజు శ్రావ ణ్, అనిల్‌ యాదవ్, మల్లు రవి, రుద్ర రాజు, వేణుగోపాల్, సీజే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పీవీ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పీవీ గురించి ఎవరేమన్నారంటే... 

రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించారు: చిదంబరం 
‘రాజకీయాల్లో నన్ను పీవీ ఎంతో ప్రోత్సహించారు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న నన్ను ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రోత్సహించారు. ఆయన తెచ్చిన పారిశ్రామిక విధానం మరువలేనిది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ రూపకర్త’ 

భూసంస్కరణల ఘనత ఆయనదే: ఉత్తమ్‌ 
‘వంగర గ్రామంలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసి ప్రధాని స్థాయికి ఎదిగారు పీవీ. వ్యక్తిగతంగా ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదే. ఆయన పుట్టుక నుండి చనిపోయే వరకు కాంగ్రెస్‌వాది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేసినం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని ఆదుకున్నది పీవీ సంస్కరణలే. జూలై 24, 1991 నాటి కేంద్ర బడ్జెట్‌ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది’ 

అవేమీ లేకుండా పాలించారు: భట్టి
‘మజిల్, మనీ పవర్‌ లేకుండా సువిశాల భారత దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగారు పీవీ. ఆయనకు అలాం టి గొప్ప స్థాయిని కాంగ్రెస్‌ కల్పించింది. ఆయన రాజకీయ జీవితానికి వన్నె తెచ్చింది ఇందిరాగాంధీ అయితే సోనియాగాంధీ సలహా మేరకు ఏఐసీసీ ఆమోదంతో ప్రధాని అయ్యారు. సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చన్న విషయాన్ని పీవీ రుజువు చేశారు..’ 

మరిన్ని వార్తలు