‘కరోనా విషయంలో కేసీఆర్‌ విఫలమయ్యారు’

26 Aug, 2020 20:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్ గురించి ఆరునెలల క్రితం గవర్నర్‌కి చెప్తే తమని సీఎం కేసీఆర్ దూషించారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉత్తమ్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘తెలంగాణలో కరోనా కట్టడి  చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ స్వయంగా చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు.  ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉందని తెలియజేయడానికి సీఎల్పీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రుల పర్యటన చేపట్టాం. తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచకపోవడానికి కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలి? 

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.  హెల్త్ అండ్ మెడికల్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.  మండల కేంద్రాల్లో 30 బెడ్స్‌, జిల్లా కేంద్రాల్లో 100 పడకల హాస్పటల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? 2014 ఎన్నికల్లో గిరిజనులకు హెలికాప్టర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది.  టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం వచ్చాక 108 వ్యవస్థ పూర్తిగా బలహీనపడిపోయింది.  కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి.  కాంట్రాక్టుర్లకు వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం కరోనాను  ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చడం లేదు? అని  ఆయన ప్రశ్నించారు. 

సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘ ఏజెన్సీ ఏరియాల్లో కరోనా  విజృంభిస్తుందిజ  వర్షాల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి.  ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం ఐసోలేషన్ సెంటర్స్ లేకపోవడం బాధాకరం.  కరోనా చికిత్స కోసం  ప్రైవేట్ హాస్పటల్స్‌లో ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసి మానిటరింగ్ చెయ్యాలి.  మినరల్ రిసోర్స్ నిధులు సరిగ్గా వాడుకోవడం లేదు’ అని  మండిపడ్డారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, కరోనా వ్యాధి ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.  కరోనా వచ్చినా వైద్యరంగంలో కొత్తగా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు.  చికిత్స చేయడానికి ఒక్కరిని కూడా పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోలేదు.  ఎమ్‌సీజీ  జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం ప్రభుత్వం మర్చిపోయింది.  కరోనా వ్యాధి వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’ అని ఆమె తెలిపారు. 

చదవండి: ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

మరిన్ని వార్తలు