MLA Jagga Reddy: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

1 May, 2022 15:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ అరెస్ట్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ  తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. గేట్లు ఎక్కి ఓయూ ఆడ్మినిస్ట్రేషన్‌ భవనాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నాయకులు వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ ముట్టడికి యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అరెస్ట్‌ చేశారు.

దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహూల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కష్టం అంత ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో చదివిన వారు చాలా మంది ఎమ్యెల్యేలు అయ్యారని, ఒక్కరు కూడా కేసీఆర్‌ను యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీని ఓయూకి తీసుకెళ్తామని, ఈ అంశంపై సోమవారం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

‘వీసి గారు ఇది ముగింపు కాదు. సందర్శన మాత్రమే. ఓ ఎంపీగా చూడటానికి వస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టతను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకునేందుకు ఎవరు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో లేని జీఓలు ఎలా తీస్తారు. కృతజ్ఞత లేని రాష్ట్రంగా తెలంగాణ ఎందుకు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావాలా. రాహుల్‌తో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ప్రజా ప్రతినిధులం ఉస్మానియాలో సందర్శిస్తాం. ఈ నెల 7న ఎట్టిపరిస్థితిలో రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్దాం.’ అని జగ్గారెడ్డి తెలిపారు.
చదవండి: రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా!

మరిన్ని వార్తలు