మునుగోడుకు ఏం చేశాడు? గతంలో టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు బీజేపీ నుంచి కాంట్రాక్టులు.. అంతే

3 Sep, 2022 14:47 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. శనివారం మునుగోడులో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ అనంతరం.. టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. అనంతరం ఎంపీ ఉత్తమ్‌ మాట్లాడుతూ.. 

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమేనని   ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం లాభం?. ఆయన గతంలో టీఆర్ఎస్‌తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు ఉత్తమ్‌. అయితే..తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుని. ఓటు మాత్రం కాంగ్రెస్‌‌కు వేయాలని మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో.. ఉద్యోగులకు జీతాలు లేవు అని విమర్శించారు. ఇక టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతివ్వడంపై స్పందిస్తూ.. అది చాలా బాధకరమని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతును తెలంగాణ సమాజం అంగీకరించదని ఆయన చెప్పారు.  

బీజేపీ కార్పొరేటర్లకు దోచిపెడుతూ.. రైతులను రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో ఏం అభివృద్ది చేశాయని టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 8 ఏళ్లుగా రాష్ట్రాని దోచుకుంటుందని.. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం 

మరిన్ని వార్తలు