మరణిస్తూ.. 8 మందికి ప్రాణదానం 

22 Nov, 2020 11:53 IST|Sakshi
కానిస్టేబుల్‌ ఆంజనేయులు అంతిమయాత్రలో పాడె మోస్తున్న సీపీ సజ్జనార్‌ తదితరులు  

సాక్షి, లక్డీకాపూల్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ స్పెషల్‌ పార్టీలో ఏఆర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న విధులకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సోమన్‌గుర్తి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అపస్మారక స్థితికి చెరుకున్న పీసీ ఆంజనేయులును స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అతని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా సోమవారం వేకువజామున పీసీ ఆంజనేయులు బ్రెయిన్‌ డెడ్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించటంతో కానిస్టేబుల్‌ ఆంజనేయులు కుటుంబ సభ్యులను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పరామర్శించారు.

ఈ సందర్భంగా జనేయులు అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని కుటుంబ సభ్యులను సీపీ సజ్జనార్‌ కోరారు. సీపీ కోరిక మేరకు వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం బాబాపూర్‌ గ్రామానికి చెందిన కోనేరి ఆంజనేయులు (2018 బ్యాచ్‌) గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్‌/కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు ఉపయోగించేందుకు గాను ఆర్గాన్‌ డొనేషన్‌ ఇనీషియేటివ్‌ ‘మరోజన్మ’ సహకారంతో ప్రభుత్వ రంగ సంస్థ ‘జీవన్‌ దాన్‌’కు అప్పగించారు. మరో 8 మంది ప్రాణాన్ని కాపాడేందుకు ముందు కొచ్చిన ఆంజనేయులు కుటుంబ సభ్యులను సీపీ సజ్జనార్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు