కూలీ నంబర్‌ 1

18 Feb, 2023 01:21 IST|Sakshi

హైదరాబాద్‌లో నిర్మాణ కార్మికులకు అత్యధిక వేతనం 

మన నగరంలో కూలీని బట్టి రూ.584 నుంచి రూ.1,035 

అత్యల్ప లేబర్‌ చార్జీ చెల్లిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలోనే 

ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనం కంటే ఇవి తక్కువే 

వాణిజ్య, ఆకాశహర్మ్యాల నిర్మాణాలే ఎక్కువ కూలీకి కారణం 

కన్‌స్ట్రక్షన్‌ యాప్‌ ప్రాజెక్ట్‌హీరో అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ప్రాజెక్ట్‌ హీరో యాప్‌లో 5 లక్షల మంది వర్కర్లు నమోదై ఉండగా.. ఇందులో హైదరాబాద్‌ నుంచి 12,285 మంది ఉన్నారు. యాప్‌లో రిజిస్టరైన 1.4 లక్షల ఉద్యోగ పోస్టింగ్‌లు, వాటి వినియోగ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్మాణ కూలీ 5 నుంచి 8% పెరిగితే.. హైదరాబాద్‌లో ఏకంగా 20% వృద్ధి చెందింది. నగరంలో పెద్ద ఎత్తున వాణిజ్య, ఆకాశహర్మ్యాల నిర్మాణాలు జరుగుతుండటం అత్యధిక కూలీ చెల్లింపులకు కారణం.

పీఎఫ్, ఈఎస్‌ఐలు దక్కడం లేదు.. 
దేశంలోని ప్రధాన నగరాలలో ప్రభుత్వం నిర్ధేశించిన దినసరి కూలీ దక్కడం లేదని ప్రాజెక్ట్‌ హీరో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సత్యవ్యాస్‌ తెలిపారు. కేవలం 8.6 శాతం మంది కూలీలకు మాత్రమే ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌), 7.1% మందికి ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్‌ఐ) కవరేజ్‌లు అందుతున్నాయని పేర్కొన్నారు. 

యూపీ నుంచే వలసలెక్కువ.. 
ప్రస్తుతం దేశంలో 5.1 కోట్ల మంది నిర్మాణ కూలీలు ఉన్నారు. అత్యధికంగా కూలీలు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వలస వస్తున్నారు. ఇక్కడి నుంచి 42% మంది దేశంలోని వివిధ నగరాల్లోని నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వస్తున్నారు. బిహార్‌ నుంచి 16%, పశ్చిమ బెంగాల్‌ నుంచి 10%, ఒడిశా నుంచి 9%, మహారాష్ట్ర నుంచి 6% కూలీలు వలస వస్తున్నారు. 

కరోనా తొలి దశలో నిర్మాణ రంగ కార్మికుల వెతలు, వలసలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. క్రమంగా నిర్మాణ రంగం పుంజుకోవటంతో ఇప్పుడిప్పుడే కూలీలు గాడినపడుతున్నారు. ఈ విషయంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ బెటరనే చెప్పాలి. ఎందుకంటే కూలీలకు దినసరి వేతనాలు అందుతుంది ఇక్కడే కాబట్టి! నగరంలో భవన నిర్మాణ కార్మికులకు రోజుకు సగటున రూ.584 నుంచి రూ.1,035 మధ్య కూలీ గిట్టుతుంది. చిట్ట చివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో రూ.515 నుంచి 925 మధ్య మాత్రమేనని కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ యాప్‌ ప్రాజెక్ట్‌ హీరో అధ్యయనంలో వెల్లడైంది. 

సమయానికి వేతనాలు చెల్లిస్తేనే.. 
గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయడానికే నగర డెవలపర్లు ప్రాధాన్యం ఇస్తారు. అలా చేయాలంటే కూలీలకు, ఉద్యోగస్తులకు సమయానికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా తొలి దశలో దేశవ్యాప్తంగా నిర్మాణ పనులు నిలిచిపోవటంతో లక్షలాది ని ర్మాణ కూలీలు పొట్టచేత పట్టు కొని సొంతూళ్లకు వెళ్లిపోయా రు. ఆ సమయంలో మా అన్ని ప్రాజెక్ట్‌లలోని 3 వేల మంది కూలీలను సుమారు 3 నెలల పాటు ఆహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తదితర అవసరాలను సొంతంగా ఏర్పాటు చేశాం.     – నరేంద్రకుమార్‌ కామరాజు, ఎండీ, ప్రణీత్‌ గ్రూప్‌  

మరిన్ని వార్తలు