సీఎం కేసీఆర్‌ కుటుంబంలో కరోనా కల్లోలం

23 Apr, 2021 23:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ తెలంగాణలో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులకు కరోనా వ్యాపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకంతా కరోనా వ్యాపించింది. కల్వకుంట్ల కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాజిటివ్‌ తేలగా అనంతరం ఆయన వెన్నంటే ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌కు కరోనా సోకింది. తాజాగా సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌ తేలింది. ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనగా అక్కడ ఆయనకు కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా సోకిన వెంటనే సీఎం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ సమయంలోనూ కేసీఆర్‌ వెన్నంటే ఎంపీ సంతోశ్‌ కుమార్‌ ఉన్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌ వైద్య పరీక్షలకు రాగా అప్పుడు కూడా సంతోశ్‌ ఉన్నారు. దీంతో ఆయన పరీక్షలు చేయించుకోగా అతడికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్‌కు పాజిటివ్‌ తేలింది. సీఎం కేసీఆర్‌ వెంట ఉండడంతో కేటీఆర్‌కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోశ్‌ కుమార్‌ హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

చదవండి: ప్రధాని మోదీకి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణలు

మరిన్ని వార్తలు