హైదరాబాద్‌: 88 మంది కోవిడ్‌ రోగుల మాయం

20 May, 2021 03:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి మాయమైన కోవిడ్‌ రోగులు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులు పలువురు.. డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు. ఈ విధంగా ఇప్పటికి 88 మంది బాధితులు ఆస్పత్రి నుంచి మాయం అయినట్టు తెలుస్తోంది.    ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కింగ్‌కోఠి ఆసుపత్రిలో కోవిడ్‌ టెస్టుల కోసం వచ్చిన వారి సంఖ్య 14,664. వీరిలో 1,802 మంది అడ్మిట్‌ కాగా 782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 261 మంది మృత్యువాత పడ్డారు. 671 మంది రోగుల్లో కొందరు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొందరు గాంధీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మిగతా 88 మంది చికిత్స పూర్తికాకుండానే అంటే నెగెటివ్‌ రాకముందే కన్పించకుండా పోవడం విస్మయం కలిగిస్తోంది. వీరి విషయంలో ఆస్పత్రి అధికారుల వద్ద సరైన వివరాలు లేకపోవడం గమనార్హం. సరైన సెక్యూరిటీ, పర్యవేక్షణ లేని కారణంగానే ఎవరు పడితే వారు లోపలికి రావడం, రోగులు కాస్త కోలుకున్నాక ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోవడం జరుగుతోందనే విమర్శలున్నాయి. పేషెంట్లకు ట్యాగ్‌లు వేయడం, సహాయకులకు పాస్‌లు ఇవ్వడం వంటివి సరిగా అమలు కావడం లేదని తెలుస్తోంది.   


వాళ్లంతా చెప్పకుండా వెళ్లినట్టు కాదు 
ఆ 88 మంది చెప్పకుండా వెళ్లినట్టేం కాదు. కొంతమంది మాకు ఇక్కడ ట్రీట్‌మెంట్‌ ఇష్టం లేదని చెప్పి వెళుతున్నారు. కొందరు చెప్పకుండా వెళ్తున్నారు. అలా వెళ్లిన సంగతి తెలిసిన వెంటనే పోలీసులకు చెబుతున్నాం.  రోగులు చెప్పకుండా వెళ్లడానికి వీల్లేకుండా సెక్యూరిటీని పెంచే దిశగా ఆలోచిస్తున్నాం. 
– డాక్టర్‌ రాజేంద్రనాథ్,సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు