కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?

24 Apr, 2021 09:25 IST|Sakshi

డాక్టర్‌ సలహాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులను మూడు వర్గాలుగా విభజిస్తాం. అవి మైల్డ్‌ (స్వల్పకాలిక), మోడరేట్‌ (మధ్యస్థ), సివియర్‌ (విషమం). అయితే వీరికి ఫలానా మందులంటూ బల్లగుద్దినట్లుగా ఉండవు. రోగిని బట్టి, అతని కండిషన్‌ను బట్టి మారుతుంటాయి. అయితే వైరస్‌ను చంపేవిగా అవి ఉంటాయి. మైల్డ్‌ కరోనాతో సాధారణ స్థితిలో ఉన్నవారిని హోం ఐసోలే షన్‌లో ఉంచి ఆన్‌లైన్‌ ద్వారా వైద్యం చేయొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు వారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయులు తెలుసుకోవాలి. ప్రధానంగా వారికి లక్షణాలను బట్టి మందులు ఇస్తాము.

ముఖ్యంగా మల్టీ విటమిన్లు సరిపోతాయి. రక్త పరీక్షలు చేయించి అవసరమైతే స్టెరాయిడ్స్‌ వాడాలని చెప్తాం. ఇక ఆక్సిజన్‌ 90–94 ఉన్నవారు, సీటీ స్కాన్‌ స్కోరింగ్‌ 10–20 మధ్య ఉన్నవారు, నడిచినా ఆయాసం వచ్చేవారిని మోడరేట్‌గా పరిగ ణిస్తాం. వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించాలి. ఆక్సిజన్‌ అవసరమైతే పెడతాం. వాళ్లకు ప్రధానంగా స్టెరాయిడ్స్‌తో పాటు రక్తాన్ని పలుచన చేసే మందులు ఇస్తాము. అవసరమైతే రెమ్‌డిసివిర్‌ ఇస్తాము.

మూడోది పరిస్థితి విషమంగా ఉండే పరిస్థితి. వీరు ఆస్పత్రిలో ఉండాల్సిందే. అంతేకాదు.. వీరికి వెంటిలేటర్‌ అవసరం పడుతుంది. పైన పేర్కొన్న మందులతో పాటు ఇమ్యునో మాడ్యులేటర్స్‌ మందులు కూడా ఇస్తాం. కొన్ని ప్రత్యేక కేసుల్లో తొసిలిజుమాబ్, ఇటోలిజుమాబ్‌ ఇస్తాము. అవసరమైతే సైటో సార్బ్‌ డయాలసిస్‌ చేస్తాం. అలాగే కాల్చిసిసిన్‌ మాత్రలు కూడా వాడతాము. ఇలా రోగి పరిస్థితిని బట్టి వైద్యం, మందులు మారుతాయి.

-డాక్టర్‌ కృష్ణ ప్రభాకర్,
చీఫ్‌ జనరల్‌ ఫిజీషియన్,
సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్‌

చదవండి: 
కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా?

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమా?

ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ పెరుగుతుందా?

మరిన్ని వార్తలు