Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్‌

18 May, 2021 09:25 IST|Sakshi
కిష్టంపల్లితండాలో శ్మశాన వాటికలో ఉంటున్న కరోనా బాధితులు

సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌/నవాబుపేట: మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్‌ కేంద్రంగా ఉపయోగించుకోవాల ని నిర్ణయించారు. తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

మొత్తం 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో మొదట ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ వాప్తి చెందితే.. మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు. దీంతో అందరూ కోవిడ్‌ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆరుగురు వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఆ వైకుంఠధామంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు రెండు పూటలా భోజనం సమకూర్చారు. ప్రస్తుతం రుద్రారానికి చెందిన యువత వీరికి నిత్యం ఆహారం సమకూరుస్తూ సేవలందిస్తోంది. వైకుంఠధామంలో ఉంటున్న పాజిటివ్‌ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి

మరిన్ని వార్తలు