ఇళ్లకే పరిమితమైన ప్రజలు, వ్యాపారస్తులు
బోసిపోయిన చౌరస్తాలు
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో గురువారం కరోనా కలకలం సృష్టించింది. ఎస్టీ హాస్టల్తో పాటు ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలుసుకున్న స్థానికులు కలవరానికి గురయ్యారు. ఒకే సారి 26 మందికి కరోనా రావడంతో ఇదే విషయమై చర్చించుకున్నారు. మధ్యాహ్నానికి ఎప్పుడు రద్దీగా ఉండే రాజేంద్రనగర్ చౌరస్తా బోసిపోయి కనిపించింది. విద్యార్థులకు కరోనా సోకిందన్న విషయంతో స్థానిక వ్యాపారస్తులు సైతం మధ్యాహ్నం దుకాణాలను మూసివేశారు.
ఇతర హాస్టల్లలో...
రాజేంద్రనగర్ ప్రాంతంలో గిరిజన హాస్టల్తో పాటు ఎస్సీ, బీసీ, బాలిక, బాలుర హాస్టల్స్ ఉన్నా యి. ఈ ఐదు హాస్టల్స్లోని విద్యార్థులంతా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యభ్యాసంసం కొనసాగిస్తున్నారు. వైద్య బృందం హాస్టల్స్లో ఉదయం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, ఇతర సిబ్బంది అందరికి నెగటీవ్గా వచ్చింది.
ఆందోళనలో తల్లిదండ్రులు...
రాజేంద్రనగర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న 24మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతున్నారు.