కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది?

24 Apr, 2021 11:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. కరోనా కార్డియో పల్మనరీ సిస్టమ్‌ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ప్రధానంగా శ్వాస సంబంధమైన వ్యాధి అని, గొంతులో వారం ఉంటుందని, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నాలుగైదు రోజుల్లో విజృంభిస్తుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు యోగాలో భాగమైన ప్రాణాయామం ఉపయోగపడుతుంది. కరోనా నివారించడానికి చేసే ప్రాణాయామాలు వేరు, వచ్చిన వారు చేయాల్సినవి వేరు. కొన్ని వ్యత్యాసాలతో వీటిని చేయాల్సి ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు ప్రాణవాయువు వినియోగం చాలా పెరుగుతుంది.

ఐసీయూలో ఉన్న వ్యక్తికి ప్రాణవాయువు అవసరం 25 లీటర్లు ఉంటే ఊపిరితిత్తులు పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి 3 లీటర్ల ప్రాణవాయువు మాత్రమే అవసరం. మామూలుగా మనం పీల్చుకునే గాలి ఊపిరితిత్తుల పైభాగంలోనే ఉంటుంది. అలాకాకుండా ఊపిరితిత్తుల కింది భాగంలోకి సక్రమంగా తీసుకెళ్లడానికి ప్రాణాయామం చేస్తాం. విభాగ ప్రాణాయామం ద్వారా పై, మధ్య, కింద భాగాలకు ప్రాణవాయువు తీసుకెళ్లగలం. తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకుంటాం. గొంతు ద్వారా శ్వాసను పీల్చుకోవడమనే ఉజ్జాయి విధానం వల్ల ఆక్సిజన్‌ రక్తంలోకి వెళుతుంది.

ప్రాణాయామంలోనే భాగాలైన అంగన్యాసం, కరన్యాసం వంటివి చేస్తే..  శ్వాసని అంతర్భాగంలోకి అంటే ఊపిరితిత్తుల వెనుక ముందు పక్కల ఇలా అన్ని చోట్లకూ పంపిస్తుంది. కోవిడ్‌కి గురైన వారు రెండున్నర సెకన్లు పీల్చుకోవడం, రెండున్నర సెకన్లు వదిలేయడం...  ఇలా నిమిషానికి 12 ప్రాణాయామాలు చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అది రాకుండా ఉండాలని చేసేవారు వేరే పద్ధతిలో చేయాల్సి ఉంటుంది.  ప్రాణాయామం అనేది సులభమైన వ్యాయామం.
-డా. ఏఎల్‌వీ కుమార్,
యోగా గురు 

చదవండి: కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?

మరిన్ని వార్తలు