కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

24 Apr, 2021 12:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూట్రిషనిస్ట్‌ సలహాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సోకిందని అకస్మాత్తుగా ఒకేసారి డైట్‌ మార్చేసుకోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అంతకు ముందు నుంచి అలవాటున్న ఆహారంలో నుంచే మంచివి ఎంచుకోవాలి. తేలికగా జీర్ణమయ్యేవే తీసు కోవాలి. పాజిటివ్‌ వచ్చింది కాబట్టి ప్రొటీన్‌ కోసమని రోజుకి నాలుగేసి గుడ్లు, మాంసం తినేయడం మంచిది కాదు. మాంసాహారాలు, వేయించిన పదా ర్థాలు, రిఫైన్డ్‌ ఫుడ్, చక్కెర ఇమ్యూనిటీకి ఏ మాత్రం పనికిరావు.

పాలు కూడా అందరికీ జీర్ణం కావు. ముందునుంచీ కషాయాలు తాగే అలవాటు ఉంటే ఓకే. లేకపోతే మాత్రం ఒకేసారి అతిగా తీసుకోవడం ఇతర సమస్యలకు కారణం అవుతుంది. కోవిడ్‌ వచ్చిందని అర్జెంటుగా ఆహారం వేళలు కూడా మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. జింక్, సిలేనియం వంటివి ఇమ్యూనిటీకి ముఖ్యం కాబట్టి కూరగాయలు, పండ్లు, పప్పులు, నువ్వులు, సన్‌ఫ్లవర్‌ సీడ్స్, పంప్‌కిన్‌ సీడ్స్‌ వంటివి తినాలి.

శరీరాన్ని బాగా హైడ్రేట్‌ చేసుకోవాలి. తులసి, అల్లం, వాము ఆకుతో టీ లా చేసుకుని తాగడం మంచిది. ఇవి ఇమ్యూనిటీకి మాత్రమే కాకుండా మన ఆహారంలోని చెడుని తొలగించడానికి కూడా ఉపకరిస్తాయి. ఆకుకూరలు, గింజలు వాడాలి. పెసరపప్పు చారు, బీరకాయ కూర వంటివి మంచిది. పిచ్చిపట్టినట్టు సప్లిమెంట్స్‌ తీసుకోవద్దు. ఆహారం ద్వారా సహజమైన పద్ధతుల్లోనే పోషకాలు అందడం మంచిది. వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా ఫుడ్‌ విషయంలో ఇంతకంటే మించిన మార్పులు అక్కర్లేదు.  

-శ్రీదేవి జాస్తి, 
న్యూట్రిషనిస్ట్, వైబ్రెంట్‌ లివింగ్‌

చదవండి: కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..?

మరిన్ని వార్తలు