చిరు వ్యాపారిపై కార్పొరేటర్‌ భర్త వీరంగం

9 Feb, 2021 12:00 IST|Sakshi
దాడిలో ధ్వంసమైన రంజన్లు 

సాక్షి, గోదావరిఖని(రామగుండం): ‘ఇంటికొచ్చి కలవాలని చెప్పినా.. అయినా పట్టించుకోలే.. నాకు తెలియకుండానే షాప్‌ పెడ్తార్రా..!’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త ఆదివారం రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. షాప్‌ యాజమానిపై దాడి చేశాడు. పక్కనే రాజస్తాన్‌కు చెందిన షాప్‌ యాజమానిని బూతులు తిట్టగా, అనుచరులు రంజన్లను ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన సముద్రాల ఓదెలు రంజన్లతోపాటు ఇతర మట్టిపాత్రలను విక్రయించుకునే షాపును మూడురోజుల క్రితం రామగుండం కార్పొరేషన్‌ కార్యాలయం టీజంక్షన్‌ సమీపంలో ఏర్పాటు చేశాడు.

అప్పటి నుంచి సదరు కార్పొరేటర్‌ భర్త తన ఇంటికి వచ్చి కలవాలని సూచించాడు. పనుల బిజీతో ఓదెలుకు వీలుకాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కార్పొరేటర్‌ భర్త ఆదివారం రాత్రి బూతులు తిడుతూ చేయిచేసుకున్నట్లు ఓదెలు తెలిపాడు. పక్కనే ఉన్న రాజస్తాన్‌వాసుల రంజన్ల షాప్‌ వద్దకు వెళ్లి కొన్ని రంజన్లను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో బాధితులు భయంతో వణికిపోయారు. సింగరేణి పర్మిషన్, మున్సిపల్‌ అనుమతితో షాప్‌ ఏర్పాటు చేసినా ఈ దౌర్జన్యం ఏమిటని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు