మేమున్నామని..మీకేం కాదని..

30 May, 2021 10:48 IST|Sakshi

హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి 15 రోజులుగా ఉచితంగా భోజనం

చేయూతనిస్తున్న కార్పొరేటర్,  మాజీ కార్పొరేటర్‌

హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలిలోని రామంతపూర్, హబ్సిగూడ, ఉప్పల్, చిలుగానగర్‌లోని వివిధ బస్తీల్లో, కాలనీల్లో ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇందులో చాలా మంది నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు ఇంట్లోనే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్‌ బారిన పడిన వారికి వారి ఇంటి ముంగిటే ఉచితంగా భోజనం అందిస్తూ.. మేమున్నాం.. మీకేం కాదని ఆపన్న హస్తం అందిస్తున్నారు పలువురు దాతలు. 

ఇంటికి వెళ్లి.. 
రామంతపూర్‌ డివిజన్‌ పరిధిలోని పలు బస్తీల్లో కరోనా బారిన పడి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి గత 15 రోజులుగా డివిజన్‌ కార్పొరేటర్‌ బండారు శ్రీవాణి వెంకట్రావు తన సొంత నిధులతో  భోజనం తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఇంటికి తమ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా భోజనం పంపిస్తున్నారు. ప్రతి ఆదివారం చికెన్‌తో బగారా రైస్‌ను పంపిణీ చేస్తున్నారు. కోవిడ్‌ తగ్గే వరకు ఉచితంగా భోజన పంపిణీ కార్యక్రమం ఉంటుందని భోజనం కావాల్సిన వారు 9100984429, 9866324329 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలంటున్నారు.  

అల్పాహారం, భోజనం.. 
చిలుకానగర్‌కు చెందిన రాజు అనే యువకుడు శ్రీధర్మశాస్త్ర సేవా సంస్థ ద్వారా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న రోగులు, పారిశుద్ధ్య కార్మికులు, పలు రైల్వే స్టేషన్ల వద్ద ఆకలితో అలమటిస్తున్న వారికి చేయూతనందిస్తున్నాడు. గత 10 రోజులుగా స్వయంగా ఇంట్లో వంట చేసుకొని ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పంపిణీ చేస్తున్నారు. భోజనం, అల్పాహారం కావాల్సినవారు 7075700618, 9052264599 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరుతున్నారు. 

ప్రతిరోజు నిత్యావసరాలు..  
రామంతపూర్‌ డివిజన్‌ పరిధిలో కోవిడ్‌కు గురైన ఆరి్థక పరిస్థితి బాగాలేని వారికి మాజీ కార్పొరేటర్‌ గంధం జ్యోత్స ఆధ్వర్యంలో బియ్యం, పప్పులు, నూనెలు  ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. నిత్యావసరాలు కావాల్సిన వారు 9618249249 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు