ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రం

9 Feb, 2022 02:51 IST|Sakshi

తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం ఉంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుం టోందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరం జన్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాల ను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావే శంలో మంత్రి మాట్లాడారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనాకేంద్రాలలో పరిశోధనలు జరగాలని సూచించారు. అంతర్జాతీ యంగా తెలంగాణ పత్తికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు.

తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పంట కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకున్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ సాగులో మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నారు నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీగా బీచుపల్లి ఫ్యాక్టరీ
అశ్వారావుపేట ఆయిల్‌ ఫెడ్‌ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం స్థలసేకరణకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీగా మార్చనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబాబాద్‌లో 84 ఎకరాల్లో ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆలుగడ్డ విత్తన సమస్యను అధిగమించడానికి విత్తన నిల్వకు కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ సోనా వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశనగ, నిజామాబాద్‌ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్‌ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీబాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు