మేడ్చల్‌లో వైరస్‌ విలయ తాండవం

4 Aug, 2020 08:56 IST|Sakshi
జవహర్‌నగర్‌ పీహెచ్‌సీలో టెస్టులు చేస్తున్న డాక్టర్‌

అధికారుల కనీస పర్యవేక్షణ కరువు 

చైన్‌ లింగ్‌ ఛేదించకపోవడంతో పెరుగుతున్న కేసులు

మేడ్చల్‌: నగర శివార్లలోని మేడ్చల్‌ నియోజకవర్గంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గతంలో పాజిటివ్‌ కేసులు పెద్దగా బయటపడకపోగా.. ప్రస్తుతం  మేడ్చల్, శామీర్‌పేట్, జవహర్‌నగర్, కీసర, పోచారం (నారపల్లి), ఘట్‌కేసర్‌ జవహర్‌నగర్‌ పీహెచ్‌సీల్లో ప్రభుత్వ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి.  గత వారం రోజుల్లో 2460 మందికి పరీక్షలు చేయగా, 489 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.అంతకుముందు వారంలో 734 కేసులు నమోదయ్యాయి.489 మందిలో 215 మందికే మెడికల్‌ కిట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. 

రహస్యంగా చిరునామాలు... 
పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి చిరునామాలు అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. బాధితుల వివరాలు సంబంధిత మున్సిపపల్, మండల, గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పకపోవడంతో  క్షేత్ర స్థాయిలో కరోనా లింక్‌ను ఛేదించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో వ్యాధి వ్యాప్తి జోరుగా సాగుతోంది. 

ప్రభుత్వ ఆస్పత్రి లేక... 
మేడ్చల్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో కరోనా బారినపడిన వారు నగరంలోని గాంథీ ఆసుపత్రి, ఇతర ఆసుపత్రులు, లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. శివార్లలో ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నా... డబ్బుల కోసం బెడ్ల కృతిమ కొరత సృష్టించడంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో  90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు.  

మరిన్ని వార్తలు