Omicron Variant: ఓ మై గాడ్‌ ఒమిక్రాన్‌.. అక్కడంతా భయం భయం

22 Dec, 2021 07:42 IST|Sakshi

ఒమిక్రాన్‌ కేసు నమోదుతో ఆందోళన

క్వారంటైన్‌లో ప్రైమరీ కాంటాక్టులు

గ్రామంలో దుకాణాల మూసివేత

సాక్షి,ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఒమిక్రాన్‌ వేరియంట్‌ మండలంలోని గూడెం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇటీవల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి సోమవారం ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే వై ద్యాధికారులు హైదరాబాద్‌కు తరలించగా, కు టుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. సెకండ్‌ వేవ్‌ కరోనాతో తీవ్రంగా నష్టపోయిన గ్రామస్తులు.. తొలి ఒమిక్రాన్‌ కేసు గూడెంలో నమోదుకావడం ఆందోళన చెందుతున్నారు.

ఎవరెవరిని కలిశాడో ?
గూడెంకు చెందిన వ్యక్తి ఈ నెల 16న దుబాయ్‌ నుంచి వచ్చాడు. ఎవరెవరిని కలిశాడోనని భ యాందోళన గ్రామస్తుల్లో మొదలైంది. ప్రైమరీ కాంటాక్ట్‌లపై వైద్య, పోలీస్‌శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి చిప్పలపల్లికి చెందిన వ్యక్తితో కారులో కలిసి వచ్చాడని తెలుసుకున్న వైద్యాధికారులు సదరు వ్యక్తి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. నాలుగు రోజుల్లో సిరిసిల్లలోని బంధువులు, ఆస్పత్రికి, బైక్‌ షోరూంలను సందర్శించినట్లు తెలిసింది. అలాగే నారాయణపూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన దావత్‌కు హాజరైనట్లు సమాచారం. గూడెంలో 14, చిప్పలపల్లిలో ఇద్దరిని హోమ్‌ క్వారంటైన్‌ చేశారు.

స్కూళ్లకు హాజరుకాని విద్యార్థులు
గూడెంలో జెడ్పీ ఉన్నత పాఠశాలతోపాటు ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు మంగళవారం హా జరుకాలేదు. తల్లిదండ్రులు ముందస్తుగా తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. మూడు అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు రాలేదు. గ్రా మంలో దుకాణాలు, హోటళ్లు తెరువలేదు.  ప్రధా న రహదారిపైకి ఎవరూరావడం లేదు. వైద్య, పో లీస్‌ అధికారుల రాకపోకలతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. 

ముందస్తు చర్యలు
గూడెంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపట్టారు. కరోనా లక్షణాలతో బాధపడితే తెలియజేయాలని కోరుతున్నారు. దుకాణాలను మూసివేయించారు. ప్రధాన వీధులతోపాటు ఒమి క్రాన్‌ పాజిటివ్‌ వ్యక్తి ఇంటి ఆవరణను కంచెతో మూసివేశారు. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావాణాన్ని ఊరంతా పిచికారీ చేశారు.

గల్ఫ్‌ నుంచి వస్తున్న వారిపై ఆరా..
వారం రోజులుగా గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వారిపై పోలీసులు, వైద్యశాఖ నిఘా పెట్టింది. సౌదీఅరేబియా, దుబాయ్, ఓమన్, బహ్రెయిన్, కువైట్‌ దేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ వైరస్‌ను సాధ్యమైనంతగా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

అవగాహన కల్పిస్తున్నాం
గూడెంలో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టాం. గూడెం, చిప్పలపల్లి గ్రామాల్లో పలువురిని క్వారంటైన్‌ చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించాం. ప్రజలందరు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలి. ఎవరూ ఆందోళన చెందవద్దు.
– సంజీవ్‌రెడ్డి, వైద్యాధికారి

చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు

మరిన్ని వార్తలు