గర్భిణికి కరోనా వైరస్‌

10 Aug, 2020 07:19 IST|Sakshi
జిల్లా ఆస్పత్రిలో ఆశ వర్కర్‌తో సూపరింటెండెంట్‌ ఆనంద్‌

తీవ్ర కడుపునొప్పి రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు 

కడుపులో శిశువు మరణించడంతో ఆపరేషన్‌ చేసిన గైనకాలజిస్ట్‌ శిరీష 

అనంతరం కోవిడ్‌ వార్డులో వైద్య సేవలు 

తాండూరు: గర్భంతో ఉన్న ఆశ వర్కర్‌కు కరోనా వైరస్‌ సోకినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి ఆమెకు ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండలం గంగ్వార్‌ గ్రామానికి చెందిన లక్ష్మి(30) ఆశ వర్కర్‌గా పనిచేస్తోంది. గర్భంతో ఉన్న లక్ష్మి గ్రామంలో విధులు నిర్వహించడంతో కరోనా వైరస్‌ సోకింది. శనివారం అర్ధరాత్రి ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్‌ శిరీష లక్ష్మి కడుపులో ఉన్న శిశువు మృతిచెందాడని గుర్తించి ఆస్పత్రి çసూపరింటెండెంట్‌ ఆనంద్‌కు సమాచారం అందించింది. సూపరింటెండ్‌ వెంటనే ఆస్పత్రికి చేరుకుని లక్ష్మికి ఆస్పత్రిలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు. అనంతరం ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, విజయవంతంగా ఆపరేషన్‌ చేసి గర్భాశయంలో ఉన్న పిండాన్ని తొలగించారు. అనంతరం లక్ష్మిని కోవిడ్‌ వార్డుకు తరలించి చికిత్స అందించారు. 

ఆసుపత్రిలో కోవిడ్‌ సేవలు.. 
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండెంట్‌ ఆనంద్‌ తెలిపారు. వార్డులో 20 మందికి ఒకేసారి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవలను అందించేందుకు వెంటిలేటర్లను సైతం అందుబాటులోకి తీసకొచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యుల సహకారం అభినందనీయమన్నారు. 

మరిన్ని వార్తలు