భర్తకు కరోనా: భయంతో ఉరేసుకున్న భార్య

23 Apr, 2021 00:01 IST|Sakshi

మెదక్‌: మహమ్మారి కరోనా వైరస్‌ దేశంలో దారుణ పరిస్థితులకు దారి తీస్తోంది. వైరస్‌ ప్రజల వెన్నులో భయం పుట్టిస్తోంది. ఈ వైరస్‌ పేరు చెబితే ప్రజలందరూ భయపడుతున్నారు. ఈ భయంతోనే చాలా మంది ప్రజలు అనారోగ్యం చెందుతున్నారు. దీంతోపాటు అతిగా భయపడ్డవారు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ వివాహిత కరోనా భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తకు కరోనా సోకడంతో భయాందోళన చెందిన ఆమె తన ప్రాణాలను తీసుకుంది.

హవేలి ఘనపూర్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (36) భర్తకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. భర్తకు కరోనా రావడంతో ఆమె కలత చెందింది. తనకు ఎక్కడ వ్యాపిస్తోందనే భయం ఆమెలో పట్టుకుంది. దాంతోపాటు తన భర్త, కుటుంబసభ్యులకు కూడా సోకుతుందనే ఆందోళనతో కంగారుపడింది. ఇదే కలతతో గురువారం లక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఒకవైపు ఆమె భర్త కరోనా సోకి చికిత్స పొందుతుండగా ఇటువైపు భార్య మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.

చదవండి: శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు
చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు