కోవిడ్‌ బాధితుడి దాతృత్వం.. మూడుసార్లు ప్లాస్మాదానం..

30 Apr, 2021 08:23 IST|Sakshi

సాక్షి, కోల్‌సిటీ(కరీంనగర్‌): గోదావరిఖనికి చెందిన ఉప్పల శ్రీధర్‌ స్వచ్ఛందంగా మూడుసార్లు ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. స్థానిక కృష్ణానగర్‌కు చెందిన శ్రీధర్‌కు గతేడాది మేలో కరోనా సోకింది. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటూ మందులు వాడి కోవిడ్‌ను జయించాడు. కరోనా పేషెంట్లకు మనోధైర్యం కల్పించడానికి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

అదే సమయంలో ‘కరోనా నుంచి కోలుకున్నవారు స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఇచ్చిన పిలుపు తనను కదిలించిందని శ్రీధర్‌ తెలిపాడు.’ గతేడాది ఆగస్టు 14న మొదటిసారి హైదరాబాద్‌లో, రెండోసారి గతేడాది అక్టోబర్‌ 16న కరీంనగర్‌లో, ఈ ఏడాది గత నెల 23న కరీంనగర్‌లో కరోనా పేషెంట్లకు ప్లాస్మా దానం చేశాడు. రక్తదానం ఎంత ప్రధానమో, ప్లాస్మా దానం కూడా అంతే ప్రధానమని శ్రీధర్‌ పేర్కొంటున్నాడు. కోవిడ్‌ను జయించినవారు అపోహలు వీడి ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాడు. 

మరిన్ని వార్తలు