కొంపముంచిన ఎన్నికల బందోబస్తు..

27 Apr, 2021 11:16 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాగర్‌ ఉప ఎన్నికలకు వెళ్లిన పోలీసులకు కరోనా 

వైరస్‌ బారిన పడిన 32 మంది సిబ్బంది 

కోలుకుంటోన్న బాధితులు

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: పోలీసు శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వైరస్‌ బారిన పడడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కరోనా సోకింది. సాగర్‌ ఉప ఎన్నికలకు జిల్లా నుంచి ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 112 మంది బందోబస్తుకు వెళ్లారు. 16 రోజుల పాటు అక్కడ విధులు నిర్వహించారు. ఎన్నిక ముగిసిన తర్వాత జిల్లాకు వచ్చిన పోలీసులు ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.

ఇప్పటివరకు 32 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు సైతం వైరస్‌ సోకింది. దీంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. కోవిడ్‌ బాధితుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో, మరి కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి 17 మంది కోలుకున్నట్లు తెలిసింది. ఉప ఎన్నికకు వెళ్లి కరోనా బారిన పడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సీపీ కార్తికేయ నిత్యం వాకబు చేస్తున్నారు. వైరస్‌ బారిన పడిన సిబ్బందితో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సీపీ, అదనపు డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, సీఐలు, ఎస్‌బీ అధికారులు ఉన్నారు. కరోనా బారిన పడిన తమ సిబ్బందితో వీరంతా మాట్లాడుతున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ మందులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.  

మరిన్ని వార్తలు