నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం 

28 Oct, 2020 01:31 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీ జోయల్‌ డేవిస్, ప్రక్కన ఏసీపీ విశ్వప్రసాద్‌ 

పక్కాగా వీడియో, ఫోటోలు తీశాం 

సిద్దిపేట ఘటనలో 27 మందిపై కేసులు నమోదు 

సీజ్‌ చేసిన డబ్బులు ఎత్తుకెళ్లడం పెద్దనేరం: సీపీ జోయల్‌ డేవిస్‌ 

సాక్షి, సిద్దిపేట‌: దుబ్బాక ఉపఎన్నికల కోసం అక్రమంగా నగదు నిల్వ ఉంచారనే సమాచారం మేరకు సిద్దిపేట పట్టణంలో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించగా... సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదు గుర్తించామని, ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ (తహసీల్దార్‌), ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మంగళవారం తెలిపారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఎవరు సమాచారం ఇచ్చినా, అనుమానం ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేస్తామన్నారు. సోమవారం నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేయగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షల నగదును దొరికిందని, సోదాల సమయంలో ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియో తీయడం జరిగిందని తెలిపారు. అంజన్‌రావు సమక్షంలోనే సోదాలు నిర్వహించామన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలీసులతో గొడవకు దిగి సీజ్‌ చేసిన డబ్బులను లాక్కున్నారన్నారు.

వీరిలో ఐదుగురిని గుర్తించి అరె స్టు చేశామని, రూ. 27,500 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో 22 మందిపై కేసు లు నమోదు చేశామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సంఘటనపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కి ఫోన్‌లో వివరించామని, సిద్దిపేటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, రావొద్దని ఆయనకు ముందుగానే చెప్పా మన్నారు. అయినా ఎంపీ సిద్దిపేటకు వచ్చే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని తి రిగి కరీంనగర్‌ పంపించామన్నారు. ఉపఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఎవరినీ అడ్డుకోవడం లేదన్నారు. ఇతర పార్టీల నాయకుల వా హనాలను కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పకడ్బందీగా దుబ్బాక ఉపఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం పని చేస్తోందన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

మరిన్ని వార్తలు