రైతు ఉద్యమంలా వీఆర్‌ఏలు పోరాడాలి 

23 Feb, 2022 02:05 IST|Sakshi
మహాధర్నాలో మాట్లాడుతున్న తమ్మినేని. చిత్రంలో జూలకంటి రంగారెడ్డి తదితరులు 

సర్కారుతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించుకోవాలి 

వీఆర్‌ఏల ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు 

‘రెవెన్యూ’కు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు: ఈటల  

కవాడిగూడ: వీఆర్‌ఏలు రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఇందుకు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగా వీఆర్‌ఏలకు పే స్కేల్‌ జీవో, ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో హైదరాబాద్‌’నిర్వహించారు.

ఇందిపార్కు ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా చేశారు. తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నాయకులు తీన్మార్‌ మల్లన్న తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వీరభద్రం మాట్లాడుతూ.. ‘వీఆర్‌ఏలు చేస్తున్న పోరాటం రాజ్యాంగబద్ధమైనది. వాళ్లకు ఇప్పటివరకు పే స్కేల్‌ ఇవ్వలేదు. సర్వీసును పర్మినెంట్‌ చేయలేదు’అన్నారు. వీఆర్‌ఏల న్యాయమైన పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందని చెప్పారు. 

అసెంబ్లీలో మాట్లాడతా: సీతక్క 
సీఎం కేసీఆర్‌ హయాంలో రెవెన్యూ శాఖ వెలవెలబోతోందని ఈటల అన్నారు. ప్రజలతో దగ్గరి సంబంధం ఉండే రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఎంఆర్‌వోలపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన చరిత్ర దేశంలో తెలంగాణకే దక్కిందన్నారు. వీఆర్‌ఏలను తొలగించి రెండేళ్లయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీఆర్‌ఏల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని సీతక్క హామీ ఇచ్చారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారన్నారు.

మరిన్ని వార్తలు