త్వరలో ‘క్రెడిట్‌ గ్యారంటీ స్కీం’

29 Aug, 2020 00:54 IST|Sakshi

నాబార్డ్‌ చైర్మన్‌ గోవింద రాజులు చింతల

కరోనా నేపథ్యంలోనూ రూ.80వేల కోట్ల రుణాలిచ్చాం

ఈ ఏడాది నాబార్డ్‌ బిజినెస్‌ రూ.ఆరున్నర లక్షల కోట్లకు..

ఇందులో 42% ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచే..

తొలిసారి తెలంగాణ రీజనల్‌ ఆఫీసు సందర్శన

సాక్షి, హైదరాబాద్‌: నాబార్డ్‌ ఆధ్వర్యంలో రాబోయే 4, 5 నెలల్లో వ్యవ సాయరంగంలో ‘క్రెడిట్‌ గ్యారంటీ స్కీం’ను ప్రారం భించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్‌ గోవిందరాజులు చింతల తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయంలో ఇలాంటి స్కీం లేదని, తొలిసారి నాబార్డ్‌ ప్రవేశ పెట్టబోతోందని వెల్లడించారు. దీనిద్వారా 85% గ్యారంటీ ఇస్తా మని, దీంతో బ్యాంకులు  అనుమానాలు లేకుండా సొసై టీలు, తదితరాలకు సులభంగా రుణాలిచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ‘వ్యవసాయ రంగ వ్యవస్థలోనే బృహత్తర మార్పులకు అవసర మైన చర్యలు చేపడుతున్నాం. రైతులకు రెండింతల ఆదాయం వచ్చేలా సాగు ఖర్చులు తగ్గే దిశగా చర్యల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వ్యవసాయాన్ని మార్కెట్‌ కేంద్రీకృతంగా చేసేం దుకు గోడౌన్ల సంఖ్య గణనీయంగా పెంచి స్టోరేజీ నిల్వల సామర్థ్యం పెంపుదల వంటి చర్యలు తీసుకుంటాం’అని ఆయన చెప్పారు. నాబార్డ్‌ చైర్మన్‌గా నియమి తులయ్యాక తొలిసారిగా తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా జీఆర్‌ చింతలకు అధికారులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డ్‌ చేపడుతున్న కార్యక్రమాలు, తదితర అంశాలను వివరించారు. 

వ్యవసాయానికి కొత్త రూపు..
భారత్‌లో ‘కలెక్టివ్‌ ఫార్మింగ్‌’కు శ్రీకారం చుట్టి.. దీని ద్వారా దేశ వ్యవస్థలో వ్యవసాయానికి కొత్తరూపు నిస్తామని జీఆర్‌ చింతల చెప్పారు. నాబార్డ్‌ ఆధ్వర్యంలో క్రెడిట్‌ రేటింగ్‌ అండ్‌ స్కోరింగ్‌ మ్యాట్రిక్స్‌ను రూపొందించి, దీంట్లో 60 శాతం దాటిన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు లభించేలా రేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందిస్తామని తెలిపారు. ‘క్రెడిట్‌ గ్యారెంటీ విధానాన్ని బలోపేతం చేస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి చిన్నాచితకా కలిపి మొత్తం 98 శాతంగా ఉన్న మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్, చిన్నవ్యాపారులకు రుణాలు అందేలా మార్పులు చేపడతాం. కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 31 వరకు రూ.80 వేల కోట్ల వరకు రుణాలిచ్చాం. రూ.25 వేల కోట్లు స్పెషల్‌ ఈక్విటీ ఫండ్‌ కింద ఇచ్చాం. ఈ ఏడాది నాబార్డ్‌ బిజినెస్‌ రూ.5.32 లక్షల కోట్ల నుంచి రూ.ఆరున్నర లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోగలదు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ ఇంతటి ఘనతను నాబార్డ్‌ సాధించింది. ఇందులో 40 నుంచి 42 శాతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచే బిజినెస్‌ ఉంటోంది. వాటిలో రూ.44 వేల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి’అని జీఆర్‌ చింతల వివరించారు. 

సహకార, గ్రామీణ బ్యాంక్‌ల బలోపేతం..
దేశంలోని కోటి 8 లక్షల గ్రూప్‌లను ఈ–శక్తి ప్లాట్‌ ఫాం మీదకు తెచ్చి, వారి క్రెడిట్‌ ఇంటెన్సిటీని 350 శాతం పెంచేందుకు నాబార్డ్‌ కొత్త కార్యక్రమాలను చేపడుతోందని జీఆర్‌ చింతల తెలిపారు. నాబార్డ్‌ బహుముఖ ప్రయత్నాల్లో భాగంగా సహకార, గ్రామీణ బ్యాంక్‌ల బలోపేతంతో పాటు సహకార రంగంలో పారదర్శకత పెంచేందుకు, రైతులు, కూలీలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ‘సంస్థాగతంగా ఆయా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గత 30 ఏళ్లలో జరగనిది కేవలం 90 రోజుల్లోనే సహకార సంఘాలకు 3 శాతం వడ్డీకే రుణాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రైతులు, మహిళల ఆదాయం పెంచడంతో పాటు ఆయిల్‌సీడ్‌ ప్రొడక్షన్‌ చేపట్టాలని ప్రధాని మోదీకి సూచించగా దాని ప్రాతిపదికన వర్కింగ్‌ గ్రూప్స్‌ మొదలయ్యాయి. దీని ద్వారా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. గ్రామీణ బ్యాంక్‌ల కంప్యూటీకరణ, ఈ వ్యవస్థలో చివరి లింక్‌ అయిన ప్రైమరీ సొసైటీల వరకు కంప్యూటీకరణ పూర్తికి చర్యలు తీసుకుంటుంన్నాం. ఇందుకోసం సహకార అభివృద్ధి నిధి కింద ప్రతీ రాష్ట్రానికి రూ.5 కోట్లు ఇస్తున్నాం. తెలంగాణలో ఇప్పటికే ఇది పూర్తి అయినా ఆ మొత్తాన్ని ఇస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాబార్డ్‌ రుణాలిచ్చింది. రెండో ప్రాజెక్టుకు మరో రుణం ఇవ్వబోతున్నాం’అని చెప్పారు. తెలంగాణలో రూ.900 కోట్లతో చెక్‌ డ్యామ్‌లను నిర్మిస్తున్నామని, రుణమాఫీ అనేది రాజకీయ నిర్ణయమని, ఈ మాఫీలకు సంబంధించిన డబ్బులు పూర్తిగా బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే సరిపోతుందని ఒక ప్రశ్నకు జీఆర్‌ చింతల జవాబిచ్చారు.  

మరిన్ని వార్తలు