ఇండియా గెలిచిన ఆనందంలో స్నేహితులతో పార్టీ.. అంతలోనే గుండెపోటుతో..

30 Aug, 2022 06:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్వంటీ ట్వంటీ క్రికెట్‌ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచిందన్న ఆనందంలో మద్యం సేవించి రాత్రి పొద్దుపోయే వరకు డ్యాన్స్‌లు చేశారు. ఉదయాన్నే చాతి నొప్పితో యువకుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

సీఐ ఎన్‌.తిరుపతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ప్రకాష్‌(26) నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వచ్చాడు. అంజయ్యనగర్‌లోని పద్మా నిలయంలో ఉంటూ కొండాపూర్‌లోని ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ చూశారు. ఇండియా గెలవడంతో స్నేహితులతో కలిసి తెల్లవారు జామున 2 గంటల వరకు మద్యం తాగి డ్యాన్స్‌ చేశారు.

ఆ సమయంలో చాతిలో నొప్పిగా ఉందని చెప్పిన ప్రకాష్‌ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్ర లేచిన అతను కొద్దిసేపు వాకింగ్‌ చేసి మళ్లీ ఛాతిలో నొప్పి వస్తుందని విశ్రాంతి తీసుకుంటానని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి స్నేహితులు అతడిని లేపేందుకు యత్నించగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్‌ ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా) 

మరిన్ని వార్తలు