గోదాదేవి కల్యాణంలో సీఎస్‌ శాంతికుమారి

15 Jan, 2023 00:51 IST|Sakshi
పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎస్‌ శాంతికుమారి 

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన గోదాదేవి– శ్రీరంగనా«థుల కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గోదా­దేవి– శ్రీరంగనాథులను అలంకరించి తిరువీధుల్లో ఆచార్యులు ఊరేగించగా.. సీఎస్‌ శాంతికుమారి దంపతులు, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, యాదాద్రి భువనగిరి అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో ముందు నడిచారు.

ఆలయ ముఖ మండపంలో జరిగిన కల్యాణ వేడుకను తిలకించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి యాదాద్రి క్షేత్రానికి వచ్చిన శాంతికుమారికి ఆచార్యులు, ఈవో గీతారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్‌ దంపతులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. 

మరిన్ని వార్తలు