సాక్షి, హైదరాబాద్: ‘కూరలో కరివేపాకు’ అని ఇప్పుడు తేలికగా తీసిపారేయకండి. కరివేపాకుకూ ఇప్పుడు డిమాండ్ పెరిగింది. దిగుబడి తగ్గి...కొరత ఏర్పడడంతో నగరంలో కరివేపాకు ధరలకు రెక్కలొచ్చాయి. మునుపెన్నడూ లేనివిధంగా హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ.120 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో ఒక కట్ట రూ. 5-10కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కరివేపాకుకు సీజన్ కాకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి. గ్రేటర్ పరిధిలోని హోల్సేల్, రిటైల్, రైతుబజార్లకు రోజు దాదాపు 10 టన్నుల వరకు దిగుమతి అవుతుంది. కరోనా కారణంగా గత పది నెలలుగా కరివేపాకు వినియోగం కూడా బాగా పెరిగింది.
కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, కాల్షియం, పాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుదల పరిచి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుందని గ్రేటర్ జనం కరివేపాకును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరల్లో వాడడమే కాకుండా కరివేపాకు పొడిని ప్రత్యేకంగా తయారు చేసి కూడా అన్నంతోపాటు తీసుకుంటున్నారు.
మూడింతలైన ధర
గ్రేటర్లో కరివేపాకుకు డిమాండ్ పెరిగిందని మీరాలం మండి ఆకుకూరల వ్యాపారి బి.లలిత చెప్పారు. గతంలో కేజీ రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ.120 ఉందన్నారు. శివారు జిల్లాల నుంచి నగరానికి కరివేపాకు దిగుమతి అవుతున్నా ప్రస్తుతం డిమాండ్కు సరిపోవడం లేదన్నారు. దీంతో విజయవాడ నుంచి కూడా కరివేపాకు దిగుమతి చేసుకుంటున్నారు.
చదవండి: ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే..
5 అడుగుల విషనాగు.. ఒంటి చేత్తో పట్టుకొంది!