అనుకూల వివరాలే మీడియాకిచ్చారు 

10 Dec, 2022 01:13 IST|Sakshi

3 గంటల నిడివి ఉన్న వీడియోను గంటకు కుదించారు

ఆ సీడీలనే మీడియాకు సీఎం కేసీఆర్‌ అందజేశారు 

హైకోర్టులో తుషార్‌ తరఫు న్యాయవాది వాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేల ఎరకు సంబంధించి మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిగాయని సైబరాబాద్‌ సీపీ తెలిపారు. ఆ తతంగాన్నంతా వీడియో తీశామని, ఆడియో రికార్డు చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాకు వీడియో, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఇందులో వీడియో నిడివి గంట మాత్రమే ఉంది.

అంటే 3 గంటల నిడివి ఉన్న వీడియోలో తమకు అనుకూలమైన దాన్ని ఉంచి.. మిగతాది తొలగించి మీడియాకు విడుదల చేశారు. సదరు వీడియో సీడీలను పోలీసులు తప్ప వేరేవరూ సీఎంకు అందజేసే అవకాశమే లేదు’అని బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌డీ సంజయ్‌.. హైకోర్టుకు వెల్లడించారు. ఆ వీడియోలను సీజేఐకి, హైకోర్టు సీజేలకు, ఇతర ప్రముఖులకు పంపించారని.. మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యేలా చేశారన్నారు.

దీన్ని తీవ్ర చర్యగా పరిగణించాలని.. క్షమాపణ చెబితే సరిపోదని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందుకుమార్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. నిందితులు నందుకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీల తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జె.ప్రభాకర్, ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపించారు.  

సిట్‌ అధికారుల ప్రమోషన్లు, బదిలీలు సీఎం చేతుల్లో... 
ఎస్‌డీ సంజయ్‌: ‘నేరుగా ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్న ఈ కేసులో సిట్‌ పారదర్శకంగా, స్వేచ్ఛగా దర్యాప్తు చేసే అవకాశమే లేదు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలి’అని విజ్ఞప్తి చేశారు. సిట్‌ వద్ద ఉన్న మెటీరియల్, సీఎం మీడియాకు ఇచ్చిన మెటీరియల్‌ ఒకటేనా? ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే కూడా సీఎంకు సమాచారం ఇచ్చి ఉండవచ్చు కదా.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

దీనికి సందీప్‌ బదులిస్తూ.. ‘పోలీసులే.. వీడియో, ఆడియోలు రికార్డు చేశారు. క్రిమినల్‌ కేసు వివరాలను ఫిర్యాదుదారుడికి కూడా వెల్లడించడానికి వీలులేదు. అలా అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. సిట్‌లో ఉన్న వారంతా ఐపీఎస్‌లు, ఇతర పోలీస్‌ అధికారులు. వారి ప్రమోష న్, డిప్యూటేషన్, బదిలీలు లాంటివన్నీ రాష్ట్రానికి హెడ్‌గా వ్యవ హరించే సీఎం చేతుల్లోనే ఉంటాయి. కేరళలో ఓ పార్టీ చీఫ్‌ తుషా ర్‌ పేరును నవంబర్‌ 3న ప్రెస్‌మీట్‌లో సీఎం తొలిసారి వెల్లడించారు. ఆ తర్వాత ఏర్పాటైన సిట్‌ తుషార్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులిచ్చింది. సీఎం డైరెక్షన్‌లోనే సిట్‌ విచారణ సాగుతోంది అనడానికి ఇంతకు మించి నిదర్శనం లేదు’ అని చెప్పారు. 

ఆడియోను నిర్ధారించకుండానే మీడియాకు వివరాలు..  
మహేశ్‌ జఠ్మలానీ: ‘మొయినాబాద్‌ ఘటన జరిగిన రోజే పోలీస్‌ కమిషనర్‌ మీడియాకు వివరాలు వెల్లడించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. సీఆర్‌పీసీ సెక్షన్‌ 157 ప్రకారం సాక్ష్యాధారాలను మేజిస్ట్రేట్‌కే అందజేయాలి. ఇతలెవరికీ లీక్‌ చేయవద్దు. ఆడియో, వీడియోల్లోని గొంతులు ఎవరివో సాంకేతిక ఆధారా లు లేకుండానే మీడియాకు వారిపై వ్యతిరేకంగా వివరాలు చెప్ప డం చట్టవిరుద్ధం. ఈ అన్ని అంశాలను పరిశీలించి సిట్‌ నిలిపివే సి, సీబీఐ దర్యాప్తు ఆదేశించాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను 13వ తేదీకి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు