పాఠశాలలు, హాస్టళ్లలో నమోదవుతున్న కరోనా కేసులు
పిల్లలను హాస్టళ్లకు పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు
తప్పని పరిస్థితుల్లో స్కూళ్లకు టెన్త్ విద్యార్థులు.. ఝరాసంగం కేజీబీవీలో 19 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్ సదుపాయం కలిగిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీ బీవీ), గురుకుల పాఠశాలలకు పంపేందుకు ససే మిరా అంటున్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధనకు మాత్రం గత్యం తరం లేని పరిస్థితుల్లో విద్యార్థులను (75–80%) స్కూళ్లకు పంపిస్తున్నారు. గత నెల 24 నుంచి ప్రారంభమైన 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండట్లేదు. ఇక హాస్టల్ వసతి ఉన్న గురుకులాలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతానికి మించట్లేదు.
భయపెడుతున్న కేసులు..
ఇటీవల సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేజీబీవీలో 19 కేసులు నమోదు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా బోథ్ గిరిజన ఆశ్రమ (బాలికల) పాఠశాలలో ఏడుగురికి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థినికి కరోనా సోకింది. వికారాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇద్దరు టీచర్లకు పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలపూర్ జెడ్పీహెచ్ఎస్లో ఇద్దరు టీచర్లు, ఒక విద్యార్థికి కరోనా వచ్చింది. ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉపాధ్యాయుడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. భద్రాద్రి కొత్తగూడెం మేదరబస్తిలో ఒక టీచర్కు, కరకగూడెం కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ఇలా టీచర్లకు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు.
ఇదీ విద్యార్థుల హాజరు పరిస్థితి..
కేజీబీవీల్లో హాజరు పరిస్థితిదీ..
తరగతి మొత్తం విద్యార్థులు అంగీకారపత్రం ఇచ్చింది స్కూల్కు వస్తున్నది హాజరుశాతం
6 13,417 3,606 2,749 20.71
7 18,350 4,560 3,241 17.66
8 18,960 4,899 3,675 19.38
9 18,784 14,552 13,515 71.95
10 17,364 5,679 15,009 86.44
11 10,337 8,178 7,241 70.05
12 8,649 6,489 5,713 66.05
ఇవీ జిల్లాల వారీగా స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లో నమోదైన పాజిటివ్ కేసులు..
జిల్లా మొత్తం కేసులు ప్రాంతం
ఆదిలాబాద్ 7 బోథ్-6, ఆదిలాబాద్ -1
వరంగల్ అర్బన్ 2 కరీమాబాద్
జగిత్యాల 4 కోరుట్ల-3, ధర్మపురి- 1
సిరిసిల్ల 1 శివనగర్
భద్రాద్రి 2 మేదరబస్తీ-1, కరకగూడెం-1
సంగారెడ్డి 19 ఝరాసంఘం
మంచిర్యాల 3 ములకల-1, గర్మిల్ల-2
నిర్మల్ 2 లక్ష్మణచాంద
వికారాబాద్ 2 వికారాబాద్