డీఏవీ స్కూల్‌ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు 

26 Oct, 2022 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్‌ నిర్వహణలో మరో  ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి  పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు  అధికారులు గుర్తించారు. తల్లిదండ్రుల  విజ్ఞప్తి మేరకు సఫిల్‌గూడకు చెందిన విద్యార్థులకు బంజారాహిల్స్‌లోని పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపిందని అధికారులు పేర్కొంటున్నారు.

సీబీఎస్‌ఈ సిలబస్‌ నిర్వహణలోనూ డొల్లతనం కనిపిస్తోంది. పాఠశాల మూసివేతతో విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన సాగిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా స్కూళ్లు నిబంధనలు పాటిస్తాయని విద్యాశాఖ చెబుతోంది. 

ఇదిలా ఉండగా  డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు.
చదవండి: ‘మా పిల్లల్ని మరో స్కూల్‌కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్‌ చేయాలి’

మరిన్ని వార్తలు