సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల విరామం తర్వాత రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత నాలుగో రోజు సమావేశాలు సోమ వారం తిరిగి ప్రారంభమవుతాయి. నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడతారు. అనంతరం ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పిస్తారు.
శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చ జరుగుతుంది. శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చతోపాటు ఈ నెల 1న శాసనసభ ఆమోదించిన నాలుగు ప్రభుత్వ బిల్లులపై చర్చ జరుగుతుంది.