ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గు 

28 Oct, 2021 02:46 IST|Sakshi

50 శాతం మంది హైదరాబాదీల అభిప్రాయం

ఆన్‌లైన్, హోం డెలివరీకి మొగ్గుచూపుతున్న 75 శాతం మంది 

ప్రజలపై చమురు, నిత్యావసర ధరల పెరుగుదల ప్రభావం 

దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 10 నగరాల్లో అధ్యయనం 

‘లోకల్‌ సర్కిల్‌ మూడ్‌ ఆఫ్‌ ది కన్జూమర్‌ నేషనల్‌’ సర్వేలో పలు అంశాలు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పండుగ షాపింగ్‌ అప్పుడే మొదలైంది. అయితే కరోనా పూర్తిగా కనుమరుగు కాకపోవడంతో భద్రమైన, సురక్షితమైన షాపింగ్‌కే 50 శాతం మంది హైదరాబాదీలు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడం, స్థానిక స్టోర్ల నుంచి హోం డెలివరీ విధానం ద్వారా షాపింగ్‌ చేస్తామని 75 శాతం హైదరాబాదీ కుటుంబాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, రౌటర్లు, ఏసీ, హీటర్లు, వాక్యూమ్‌ క్లీనర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌ ప్యూరిఫైర్లు, వినిమయ ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఉత్పత్తులు, ఇంటికి మరమ్మతులకు సంబంధించిన కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

పండుగ సామగ్రి, వస్తువులు, తినుబండారాల తయారీకి ఉపయోగించే పదార్థాలు, దుస్తులు, బంధుమిత్రులకు కానుకలు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, అప్లియన్స్‌లు వంటివి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 10 నగరాల్లోని దాదాపు 2 లక్షల మంది నుంచి సేకరించిన వివిధ అంశాల ఆధారంగా రూపొందించిన ‘లోకల్‌ సర్కిల్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది కన్జూమర్‌ నేషనల్‌ సర్వే’లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

కుటుంబాల బడెŠజ్ట్‌పై తీవ్ర ప్రభావం.. 
కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌ దాకా దేశవ్యాప్తంగా వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్‌ అనూహ్యంగా పెరిగిందని అంచనా వేసింది. మే 30 నాటికి 30 శాతం మేర ఉన్న షాపింగ్, సెప్టెంబర్‌ ఆఖరుకు 60 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. అయితే గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావంతో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాల బడ్జెట్‌లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వే తేల్చింది.

గత మూడు వారాలుగా వినియోగదారులు వివిధ ఉత్పత్తులు, సర్వీసుల గురించి ‘ఆన్‌లైన్‌ లోకల్‌ కమ్యూనిటీస్‌’నుంచి సలహాలు, సిఫార్సులు కోరుతున్న పరిస్థితుల్లో దేశంలోని 10 ప్రధాన నగరాల్లోని కుటుంబాలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయన్న దానిపై లోకల్‌సర్కిల్స్‌ అధ్యయనం దృష్టి సారించింది. ఈ నగరాల్లోని కుటుంబాలు ఏయే వస్తువుల కొనుగోళ్ల షాపింగ్‌కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, గురుగ్రామ్, నోయిడాలోని 61 వేల కుటుంబాల్లోని 2 లక్షల మందిపై ఈ సర్వే నిర్వహించారు. 

షహర్‌ హమారా హైదరాబాద్‌లో.. 
పండుగ సీజన్‌లో వినియోగదారుల సెంటిమెంట్‌ ఎటువైపు మొగ్గుచూపుతుందని అంచనా వేసేందుకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే 4 వేల కుటుంబాలు వాటిలోని 13 వేల మంది నుంచి వివరాలు సేకరించారు. షాపింగ్‌ విధానాలు, కేటగిరీ వస్తువులు. ఏ పద్ధతులు, విధానాల్లో షాపింగ్‌ చేస్తారు? ఎలాంటి కేటగిరీలకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులు కొంటారు? పండుగ సందర్భంగా ఎలాంటి వస్తువులు కొనాలని అనుకుంటున్నారు..? ఏయే వాటికి ఖర్చు చేయబోతున్నారనే అంశాలను పరిశీలించారు.

ఇక్కడి సర్వేలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. భద్రమైన, సురక్షిత షాపింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నట్లు 50 శాతం మంది స్పష్టం చేశారు. తమకు అనువైన బడ్జెట్‌తో, ఆయా వస్తువుల అవసరం.. విలువ ఆధారంగా షాపింగ్‌ చేస్తామని 38 శాతం, తమవీలు, సౌకర్యాన్ని బట్టి వస్తువులు కొనుగోలు చేస్తామని 12 శాతం వెల్లడించారు.

అది కూడా ఆన్‌లైన్‌ సైట్లు, యాప్‌ల ద్వారా మెజారిటీ వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని 62 శాతం వెల్లడించారు. వివిధ వినియోగ వస్తువులను కొనేందుకు షాపులు, మార్కెట్లకు వెళతామని 25 శాతం మంది, స్థానికంగా ఉన్న స్టోర్ల ద్వారా, క్యాటలాగ్‌ ఆన్‌లైన్‌ ఆర్డర్‌ డెలివరీ ద్వారా 13 శాతం కొనుగోలు చేస్తామని తెలిపారు. 

హైదరాబాద్‌ సర్వే కీలకాంశాలు.. షాపింగ్‌ చేసేటప్పుడు ఏది ముఖ్యం 
భద్రత 50 శాతం 
బడ్జెట్‌/విలువ 38 శాతం 
వీలు, అనుకూలతలను బట్టి 12 శాతం ఇష్టమైన వస్తువుల కొనుగోళ్లు? 
ఆన్‌లైన్‌ సైట్లు, యాప్‌ల ద్వారా ఆర్డర్‌ 62 శాతం 
స్టోర్స్‌ లేదా మార్కెట్లను సందర్శిస్తామన్న 25 శాతం 
క్యాటలాగ్‌ ఆన్‌లైన్, ఆర్డర్‌ డెలివరీ ఉన్న స్టోర్ల నుంచి 13 శాతం ఏ వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తారు ? 
స్మార్ట్‌ఫోన్లు, మొబైల్, టాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, రౌటర్లు, ఎలక్ట్రానిక్‌ సామగ్రి, ఏసీ, హీటర్లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, టీవీ. ఫ్రిజ్‌లు, ఎయిర్‌ ప్యూరీఫయర్లు వంటివి 75 శాతం 
కేవలం స్మార్ట్‌ఫోన్లు, ఇతర వినిమయ ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఉత్పతుతలు 25% మంది ఎలాంటి ఆహార పదార్థాలు, నిత్యావసరాలు కొంటారు ? 
స్పెషల్‌ వస్తువులు, పండ్లు, ఫలాలు, డ్రైఫూట్లు, సంప్రదాయ స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, ఇతర పదార్థాలు 75 శాతం 
వీటిలో కొన్నింటిని మాత్రమే కొనే వారు 25 శాతం   

మరిన్ని వార్తలు