Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!

4 Oct, 2022 17:43 IST|Sakshi

తహసీల్‌ ఆఫీసుల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు

వితంతు, ఒంటరి మహిళలకు తప్పని వేధింపులు

పట్టించుకోని అధికారగణం 

ముషీరాబాద్‌ భోలక్‌పుర్‌కు చెందిన మహిళకు వితంతు పింఛన్‌ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్‌ ఆఫీస్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్‌ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని  చెబుతున్నాడని  ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి  తహసీల్దార్‌ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్‌దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్‌ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. 

మహిళలకు వేధింపులే... 
ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల  పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్‌ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. 


కార్డుల పంపిణీ అంతంతే.. 

సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్‌లైన్‌ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్‌లైన్‌ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది.  

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం మీద  సుమారు 80,824 మంది  ఆసరా పింఛన్లు  మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్‌ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!)

మరిన్ని వార్తలు