ఆస్తుల ఆన్‌లైన్‌ 62 శాతం..

13 Oct, 2020 03:19 IST|Sakshi

గ్రామాల్లో 62.51 లక్షల ఆస్తులు

సోమవారానికి 38.83 లక్షలు నమోదు

సాంకేతిక సమస్యలతో జాప్యం.. మారుమూల గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ సమస్య

సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: గ్రామ పంచాయతీల్లో ఆస్తుల నమోదు మెల్లిగా ఊపందుకుంటోంది. గ్రామీణ ప్రాం తాల్లో 62,51,990 ఆస్తులు ఉండగా.. ఇందులో సోమవారం నాటికి 38,83,165 ఆస్తుల వివరా లను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అంటే 62% ఆస్తులను ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. సాగు, వ్యవ సాయేతర ఆస్తుల నమోదుకు ధరణి పోర్టల్‌ను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన సర్కారు.. ఈ దసరా నుంచి వీటిని అందుబాటు లోకి తేవాలని ముహూర్తం ఖరారు చేసింది. సాగు భూములను తహసీళ్లలో... వ్యవసాయేతర ఆస్తులను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో ఆస్తుల రికార్డులను పకడ్బందీగా నిర్వహించా లని భావించి.. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్‌పుస్తకాలను జారీ చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ప్రతి ఆస్తిని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ.. ఇప్పటికే ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలతో సరిపోల్చుకుంటూ ఇంటింటికి వెళ్లి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం వివరాలను సేకరిస్తోంది. ఇంటి యజమాని ఫొటో, ఆధార్, ఫోన్‌ నంబర్‌ తదితర సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తోంది. ఇలా సేకరించిన సమాచారాన్ని ధరణి పోర్టల్‌తో అనుసంధానించనుంది.

సాంకేతిక సమస్యలతో సతమతం
సాంకేతిక సమస్యలతో ఆస్తుల నమోదు ముం దుకు సాగడంలేదు. మొబైల్‌ సిగ్నల్స్‌ బలహీ నంగా ఉండడం.. సర్వర్‌ ప్రాబ్లమ్‌ ఆన్‌లైన్‌కు అడ్డంకిగా మారాయి. దీనికితోడు సేకరించాల్సిన డేటా చాంతాడంత ఉండడం... కొన్నింటికి ఆధార్‌ వివరాలు తప్పనిసరి కావడం కార్య దర్శులకు ముచ్చెమటలు పట్టించింది. ఒక్కో ఇంటి వద్ద ఆస్తుల నమోదుకు కనీసం నలభై నిమిషాల నుంచి గంట దాకా సమయం పడు తోంది.

ఏకంగా 30 అంశాలు ఉండటంతో పూర్తి చేయడానికి సమయం పడుతోంది. ఈలోగా ఏదన్నా సాంకేతిక సమస్య వస్తే మళ్లీ మొదటి నుంచీ చేయాల్సి వస్తోంది. అటవీ ప్రాంతాల్లోని మండలాలు, గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్య మరింత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. గత రెండు రోజులుగా కొంతమేరకు సాంకేతిక సమస్యలు అధిగమించినా.. ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువు (10వ తేదీకి) కల్లా 55.01 శాతం ఆస్తుల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌ చేయగలిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో పది రోజుల గడువు (ఈనెల 20 దాకా) పెంచింది. ఆన్‌లైన్‌ నమోదులో స్పీడు పెంచిన పంచాయతీరాజ్‌శాఖ సోమవారం నాటికి 62.11 శాతం కట్టడాల డేటాను ఆన్‌లైన్‌లోకి ఎక్కిం చింది. మరోవైపు గడువులోపు మిగతా వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వీలుగా అదనపు సిబ్బందిని రంగంలోకి దించుతోంది. 

అనుమానాలు... భయాలు
ఆస్తుల నమోదుకు గ్రామాలకు వెళుతున్న పం చాయతీ సిబ్బందికి ఆస్తుల యజమానులు అం తగా సహకరించడం లేదని అంటున్నారు. వ్యవ సాయ సీజన్‌ పనులు జోరుగా జరుగు తుండ డం, జనాలు కూలి పనులకు వెళ్తుండడంతో ఇళ్ల యజమానులను వెతుక్కోవాల్సి వస్తోంది. పన్నుల భారం పడుతుందేమోనన్న ఆందోళన తో కొందరు యజమానులు ఆస్తుల నమోదుకు ముందుకు రావడం లేదు. ఆస్తుల వివరాలిస్తే సంక్షేమ పథకాలకు అనర్హులు అవుతామేమో నని భయపడుతున్నారు. పూర్తి వివరాలు చెబితే ఏమవుతుందోనన్న అనుమానంతో అసంపూర్తి వివరాలు చెబుతున్నారని కార్యదర్శులు అంటు న్నారు. ఇక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాల ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. కుటుంబ యజమానిని ఇంటి ఎదుట నిలబెట్టి ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన సమ స్యగా మారుతోంది. ఇంకో వైపు గత కొన్నేళ్లుగా ఇంటి పన్నులు భారీ మొత్తంలో పెండింగ్‌లో ఉండటంతో ఆస్తుల వివరాల నమోదుకు యజ మానులు ముందుకు రావడంలేదని పంచా యతీ కార్యదర్శులు చెబుతున్నారు.

ఎందుకు నమోదు చేయించుకోవాలి?
ఆస్తుల నమోదు ఎందుకు చేయించుకోవాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసినప్పుడు అన్ని వివరాలు చెప్పాం. ఏం ప్రయోజనం కలిగింది? గ్రామ పంచాయతీ అనుమతితోనే ఇండ్లు కట్టుకున్నాం. అన్ని వివరాలు పంచాయతీ ఆఫీసులో ఉన్నాయి. మళ్లీ ఎందుకు? 
– కొనకళ్ళ హన్మంత్‌ రావు, దామరచర్ల, నల్లగొండ జిల్లా 

ఆస్తుల వివరాలు ఇవ్వడం లేదు
ప్రజల ఆస్తుల నమోదు ప్రక్రియలో కొందరు వివరాలు ఇవ్వడం లేదు. కొంతమంది వ్యవసాయ భూముల పట్టాపాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదు. కొంతమందికి నచ్చజెబితే ఇస్తున్నారు. ఇవ్వని వారి వివరాలు నమోదు చేయడం లేదు. అంతేకాకుండా 30 అంశాల వివరాలు నెట్లో నమోదు చేసే వరకు సిగ్నల్‌ ప్రాబ్లం అవుతోంది. దాని వల్ల ఒక్కొక్క ఇంటి వద్ద అరగంటకు పైగా సమయం పడుతోంది. 
– శ్రవణ్‌కుమార్, కార్యదర్శి, వేములపల్లి, నల్లగొండ జిల్లా  

మరిన్ని వార్తలు