MLC Kavitha Letter To ED: ఈడీ అధికారులకు కవిత సంచలన లేఖ..

21 Mar, 2023 12:05 IST|Sakshi

న్యూఢ్లిలీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడో రోజు విచారణకు ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్లు ధ్వంసం చేశానని తనపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను అధికారులకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం  చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? అని ప్రశ్నించారు.

'దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్లు ధ్వంసం చేశానని పేర్కొంది. కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఏమీ అడగకుండానే ఏ పరిస్థితుల్లో, ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ?  నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే.

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం.' అని కవిత లేఖలో ఘాటు విమర్శలు చేశారు.
చదవండి: ఈడీ ముందుకు మూడోసారి.. పాత ఫోన్లన్నీ అప్పగించిన కవిత..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు