3,109 మందికి డెంగీ

23 Aug, 2022 00:50 IST|Sakshi

ఆగస్టు 15 వరకు 32,449 నమూనాల సేకరణ

9.58 శాతం పాజిటివిటీ నిర్ధారణ

హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు .. తర్వాత రంగారెడ్డిలో నమోదు 

రాష్ట్రంలో 378 మందికి మలేరియా.. 44 మందికి చికున్‌ గున్యా

వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లక్షణాలున్నవారి నుంచి శాంపిళ్లను సేకరించి వైద్య ఆరోగ్యశాఖ డెంగీ కేసులను గుర్తిస్తోంది. ఆ విధంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 32,449 నమూనాలను సేకరించి పరీక్షించింది. అందులో 3,109 మందికి డెంగీ (9.58% పాజిటివిటీ) నిర్ధారణ అయిందని పేర్కొంది.

ఈ మేరకు తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు. భారీ వర్షాలకు పట్టణాలు, పల్లెల్లో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో..:  అన్ని జిల్లాల్లోనూ డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా హైద రాబాద్‌లో 12,205 రక్త నమూనాలను పరీక్షించగా, అందు లో 1,470 మంది డెంగీ బారిన పడ్డారు. అంటే ఇక్కడ 12. 04 పాజిటివిటీ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 2,044 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 322 మందికి డెంగీ (15.75 శాతం పాజిటివిటీ) సోకింది.

మేడ్చల్‌ జిల్లాలో 1,375 నమూనాలకు గాను 165 మందికి, ఖమ్మం జిల్లాలో 3,815 మందికి గాను 126 మందికి, కరీంనగర్‌ జిల్లాలో 1,011 మందికి గాను 123 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 1,662 మంది నమూనాలను పరీక్షించగా 88 మందికి, ఆదిలాబాద్‌ జిల్లాలో 729 మంది నమూనాలను పరీక్షించగా, 81 మందికి డెంగీ సోకినట్లు తేలింది. కాగా రాష్ట్రంలో 378 మందికి మలేరియా, 44 మందికి చికున్‌గున్యా సోకింది. 

డెంగీ లక్షణాలివే..: ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపి తే నొప్పి పుడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. కండరా లు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. 

ప్లేట్‌లెట్‌ కౌంట్‌ ఒక్కటే సరిపోదు: డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్‌లెట్లు 20 వేల లోపునకు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు.

15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవి స్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడుస్తుండాలి. ఎల క్ట్రాల్‌ పౌడర్, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు అదుపులోకి వస్తాయి.

ముందు జాగ్రత్తలే మంచిది: దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. స్కూల్‌ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాలల పరిస రాలు శుభ్రంగా ఉంచాలి. కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్‌ ఫీవర్‌ అయితే మంచినీరు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు